విజయశాంతి రాజకీయ భవిష్యత్తు పై సందిగ్ధత వీడటంలేదు. కొంతకాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న ఆమె వేరే పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

లేడీ సూపర్ స్టార్ గా , అగ్రకథానాయకగా సినిమాలో ఓ వెలుగు వెలిగిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాల్లోనూ బాగానే రాణించారు. సొంతంగా పార్టీ పెట్టి ఆ తర్వాత టీఆర్ఎస్ కి వెళ్లి ఎంపీ గానూ పేరు తెచ్చుకున్నారు.

అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనుకోని పరిస్థితుల్లో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత సోనియా గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ లో చేరారు. గత సాధారణ ఎన్నికల్లో పోటీ చేసినా ఏ మాత్రం ప్రభావం చూపలేదు. దీంతో ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ లోనే ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో అసలు పాల్గొనడటమే లేదు.

అసలు ఇన్నాళ్లు మీడియా ముందుకు కూడా రాలేదు. అయితే ఈ రోజు రైల్‌రోకో కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టుకు ఆమె హాజరయ్యారు. అయితే ఆ సమయంలో జడ్జి లేకపోవడంతో ఆమె వెనుదిరిగారు.

ఈ సందర్భంగా మీడియా... ఆమె రాజకీయ భవిష్యత్తు పై ప్రశ్నించగా సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. సమయం వచ్చినప్పుడు దానిపై మాట్లాడుతానని అన్నారు. ఇంతకీ ఆ సమయం ఎప్పుడొస్తుందనేదే తెలియడం లేదు. పార్టీ మారే యోచనలో ఉండడంతోనే ఆమె ప్రస్తుత ప్రభుత్వంపై మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మరోవైపు ఇటీవల జయలలిత మృతి తర్వాత విజయశాంతి అన్నాడీఎంకే అధ్యక్షురాలు శశికళను కలవడంతో ఆమె తమిళరాజకీయాల్లోకి వెళ్తారనే ప్రచారమూ జరిగింది. అయితే దీనిపై విజయశాంతి ఇప్పటివరకు స్పందించలేదు.