రాష్ట్రపతి కావాలనే కోరిక లేదు: ఉప రాష్ట్రపతి వెంకయ్య
తనకు రాష్ట్రపతి కావాలనే కోరిక లేదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు . బుధవారం నాడు హైద్రాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: రాష్ట్రపతి కావాలనే కోరిక తనకు లేదని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు చెప్పారు. బుధవారం నాడు హైద్రాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ chiranjeevi మాట్లాడుతూ వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. దేశంలోని అత్యున్నత పదవిని వెంకయ్య అధిష్టించాలని ఆయన కోరుకొన్నారు.. ఈ వ్యాఖ్యలపై Venkaiah naidu స్పందించారు. తనకు రాష్ట్రపతి కావాలనే కోరిక లేదన్నారు.ఉప రాష్ట్రపతి పదవిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను త్వరగా నిద్రపోతున్నానని చెప్పారు.జనానికి దూరంగా ఉండడం తనకు ఇష్టం ఉండదన్నారు. అయితే తాను రాష్ట్రపతి కావాలని చాలా మంది కోరుకొంటున్నారన్నారు. చాలా మంది అనుకొంటున్న అభిప్రాయాలను చిరంజీవి వ్యక్తం చేశారని వెంకయ్య నాయుడు చెప్పారు. ఉప రాష్ట్రపతి పదవి తక్కువేం కాదన్నారు. జనంతో కలిసి తిరిగి పనిచేయడం తనకు సంతోషంగా ఉంటుందన్నారు. వీలైనంత వరకు జనంతో ఉండాలనేది తన కోరిక అని ఆయన చెప్పారు. రాష్ట్రపతి పదవిని ఇస్తామని తనకు ఎవరూ కూడా ప్రతిపాదించలేదన్నారు.
ఉప రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత తన వేష భాషలో కూడా మార్పు లేదన్నారు. ఈ విషయమై తనను ఓ మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకు తాను ఇలానే ఉంటానని తాను చెప్పినట్టుగా వెంకయ్యనాయుడు గుర్తు చేసుకొన్నారు. విదేశాల్లో పర్యటించిన సమయంలో తాను ఇదే వేషధారణకు వెళ్తానని చెప్పారు. ఇటీవల తాను ఓ దేశంలో పర్యటించిన సమయంలో తనతో పాటు మరో దేశానికి చెందిన అతిథి మాత్రమే సంప్రదాయ దుస్తులతో సమావేశానికి హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అయితే ఈ సమావేశానికి హాజరైన వారంతా తమను అభినందించారని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకొన్నారు.
రాజకీయాలపై తనకు ఆసక్తి లేదన్నారు.అంతేకాదు చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పనిచేశాడని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.అయితే ప్రజలకు దూరంగా ఉంటున్నాననే బాధ మాత్రం ఉందన్నారు.కరోనా వైరస్ కొంత మంచి కూడా చేసిందన్నారు. కరోనా పట్టణ ప్రాంతాల ప్రజలకే ఎక్కువగా వ్యాపించిందన్నారు ఈ విషయమై పరిశోధనలు చేయాలని తాను రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లానని వెంకయ్యనాయుడు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కష్టపడి పనిచేస్తారన్నారు.
also read:రెట్రోసా ఎలక్ట్రిక్ స్కూటర్: ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
అంతేకాదు పౌష్టికాహరం కూడ తీసుకొంటారన్నారు. నగర ప్రజలు మాత్రం గ్రామీణ ప్రజల మాదిరిగా ప్రశాంత వాతావరణంలో, విశాలమైన ఇళ్లలో ఉండరన్నారు. బర్గర్లు,పిజ్జాలు విదేశీ వాతావరణానికి అనువుగా ఉంటే ఉండొచ్చు, కానీ ఈ తిండి మన దేశానికి పనికి రాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఇల్లు ఎలా నిర్మించాలనే విషయాలపై వాస్తు శాస్త్రం బాగా చెబుతుందన్నారు. అయితే వాస్తు శాస్త్రం పేరుతో కొందరు పిచ్చి పిచ్చి సలహాలతో ఇళ్ల నిర్మాణాన్ని అడ్డగోలుగా చేస్తున్నారన్నారు. జీవితంలో ఎప్పుడూ నెగెటివిటీ ఉండొద్దు కానీ కరోనా విషయంలో నెగెటివ్ ఉండాల్సిందేనన్నారు. పట్టణాల్లో కరోనా బాగా విజృంభించిందని, గ్రామాల్లో కరోనా ప్రభావం అంతగా లేదన్నారు. పట్టణాల్లో జీవనం, జీవన విధానం దగ్గరదగ్గరగా ఉందని, రాబోయే రోజుల్లో గాలి వెలుతురు వచ్చేలా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గాలి వెలుతురు రాకపోతే అది ఇల్లే కాదు. ఇంటికి సౌందర్యమా, సౌకర్యమా ఏది ముఖ్యమో ఆలోచించుకోవాలి. సౌకర్యం ఉంటేనే ఇల్లు సౌందర్యంగా ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు.