కేటిఆర్ ను వదల బొమ్మాలీ అంటున్న విహెచ్
- సిరిసిల్లలో విహెచ్ దీక్షకు అనుమతి నిరాకరణ
- కరీంనగర్ లో దీక్షా శిబిరం నెలకొల్పిన విహెచ్
- దసరా వరకు రిలే దీక్షలు చేపడతామని ప్రకటన
- నేరెళ్ల బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన
తెలంగాణ సిఎం కేసిఆర్ తనయుడు, మంత్రి కేటిఆర్ పై గట్టి పోరాటమే చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హన్మంతరావు. నేరెళ్లలో ఇసుక లారీలను తగులబెట్టారన్న కోపంతో కొందరు దళితులను పోలీసులు చితకబాదారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారు. ఈ నేపథ్యంలో వారికి న్యాయం చేయాలని కోరుతూ కరీంనగర్ లో రిలే నిరహార దీక్షలను శుక్రవారం షురూ చేశారు విహెచ్.
మొదటినుంచీ నేరెళ్ల దళిత బాధితులకు విహెచ్ అండగా నిలిచారు. వారి విషయంలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతున్నారు. వారిని నిమ్స్ నుంచి బలవంతంగా పంపినప్పుడు కూడా వారికి విహెచ్ అండగా నిలిచారు. వారి పక్షాన ధర్నా కూడా చేశారు. అయితే నేరెళ్ల బాధితులకు ఇప్పటి వరకు న్యాయం జరిగిన పరిస్థితి లేదని, బాధితులు ఇంకా కోలుకోలేదని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నిరోజులైనా వారి దెబ్బలు మానలేదంటే వాళ్లను ఎట్లా కొట్టిర్రరో అర్థం చేసుకోరి అని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దాడికి కారణమైన ఎస్పీపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తూతూమంత్రంగా ఎస్సైని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నేరెళ్ల దళితులపై పోలీసుల దాడులు.. ర్రాష్ట్రంలో ప్రభుత్వ దామనకాండకు నిరసనగా సిరిసిల్ల లో రిలే దీక్ష ప్రారంభించాలనుకున్నారు విహెచ్. కానీ ఆయన సిరిసిల్లలో దీక్ష చేపట్టేందుకు సర్కారు అనుమతి లభించలేదు. దీంతో తన దీక్షను కరీంనగర్ కు మార్చారు. కరీంనగర్ లో దీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు తాను దీక్ష చేస్తానని, తర్వాత ఇంకో బ్యాచ్ దీక్షలో కూర్చుంటుందని ఏషియా నెట్ ప్రతినిధికి తెలిపారు విహెచ్. దసరా వరకు ఈ రిలే నిరహార దీక్షా శిబిరం కంటిన్యూ అవుతుందన్నారు. ఆమరణ దీక్ష చేస్తామంటే వెంటనే అరెస్టు చేస్తారు కాబట్టి సర్కారు మెడలు వంచేందుకే తాను రిలే దీక్షలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మృత్యుంజయం తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి