వాహన పూజ కోసం ఏకంగా హెలికాప్టర్నే యాదాద్రి ఆలయానికి తెచ్చిన హైదరాబాద్ బిజినెస్మ్యాన్.. వైరల్ వీడియో ఇదే
కొత్త వాహనాలకు పూజ చేయడం మనకు కొత్తేమీ కాదు. టూ వీలర్, ఫోర్ వీలర్లకు వాహన పూజలు సర్వసాధారణంగా మనం చాలా సార్లు చూసే ఉంటాం. కానీ, హైదరాబాద్ బిజినెస్మ్యాన్ ఈ ఆచారాన్ని మరింత వేరే లెవెల్కు తీసుకెళ్లారు. ఆయన ఏకంతా తన కొత్త హెలికాప్టర్నే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి తీసుకెళ్లి వాహన పూజ చేయించుకున్నారు.
హైదరాబాద్: కొత్త వాహనం కొన్నారంటే దానికి పూజ నిర్వహించనిదే బయటకు తీయరు. టూ వీలర్, ఫోర్ వీలర్ వాహన పూజలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొనుగోలు చేసిన వాహనం తనకు కలిసి రావాలని, ఎలాంటి ప్రమాదాలు, అవాంతరాలు కలిగించకుండా ఉండాలని పూజ చేసి మొక్కుకుంటారు. ఇది చాలా చోట్ల అనాదిగా వస్తున్న ఆచారమే. కానీ, హైదరాబాద్కు చెందిన బిజినెస్మ్యాన్ ఈ ఆచారాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లారు. ఆయన ఏకంగా హెలికాప్టర్కే వాహన పూజ చేశారు. ఇందుకోసం ఆ చాపర్ను యాదాద్రి ఆలయానికి తీసుకెళ్లారు.
హెలికాప్టర్కు యాదాద్రి టెంపుల్లో ముగ్గురు పురోహితులు వాహన పూజ చేస్తున్న వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. బిజినెస్ టైకూన్ బోయినిపల్లి శ్రీనివాస రావు తాను కొత్తగా కొనుగోలు చేసిన హెలికాప్టర్కు వాహన పూజ చేయించారు. ఇందుకోసం ఆ చాపర్ను సమీపంలోని యాదాద్రి నరసింహ స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. తాను కొనుగోలు చేసిన ఎయిర్బస్ ఏసీమెచ్-135కు పూజ చేయించారు. ప్రతిమ గ్రూప్ చైర్మన్ బోయినిపల్లి శ్రీనివాస రావు, ఆయన కుటుంబ సభ్యులు ఈ పూజలో పాల్గొన్నారు.
Also Read: వైరల్.. మొదటిసారి మంచును చూసిన ఎడారి ఒంటె.. సంతోషంతో పిల్లమొగ్గలేస్తూ కేరింతలు..
ఏసీహెచ్ 135 ఎయిర్ బాస్ చాపర్ ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఉత్తమ ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్ మాడల్ అని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణికులను చేరవేసే సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఎంచుకునే లేదా కోరుకునే చాపర్ ఇదే. దీనికి ఎన్నో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీని విలువ సుమారు 5.7 మిలియన్ డాలర్ల వెల ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఈ బిజినెస్ టైకూన్ శ్రీనివాస రావు బంధువు అని కొన్ని వర్గాలు తెలిపాయి. విద్యా సాగర్ రావు కూడా ఈ వాహన పూజ జరుగుతున్నప్పుడు ఉన్నట్టు తెలుస్తున్నది. వాహన పూజ తర్వాత ఆయన కూడా అక్కడ హెలికాప్టర్లో ఓ రౌండ్ వేసినట్టు సమాచారం.