మునుగోడు అభ్యర్థి విషయంలో ప్రతిపాదనలు పంపించాం.. ఏఐసీసీదే తుది నిర్ణయం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపినట్టుగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దానిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుని.. అభ్యర్థిని ఖరారు చేస్తుందని తెలిపారు.
మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి విషయంలో ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపినట్టుగా కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దానిపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుని.. అభ్యర్థిని ఖరారు చేస్తుందని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈరోజు గాంధీభవన్లో సమావేశం అయ్యారు. మునుగోడు ఉపఎన్నికపై ప్రచారం, అభ్యర్థి ఎంపికపై చర్చించారు. నియోజకవర్గంలో మండలాల ఇంచార్జ్లుగా ఉన్నవారితో జూమ్ కాల్లో మాట్లాడారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు గెలుపు కోసం సమిష్టిగా పార్టీ నాయకులందరం సమిష్టిగా కృషి చేస్తామని చెప్పారు.
రాజాసింగ్ను బీజేపీ ఆయుధంగా వాడుకుంటోందని ఆరోపించారు. రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి రాజాసింగ్పై విచారణ చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈడీ, సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని కేంద్రం తెలంగాణకు ఆదేశాలు ఇవ్వడం టీఎర్ఎస్, బీజేపీ ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. మునుగోడు ముందు రెండు ప్రాంతాల మధ్య సెంటిమెంట్ రెచ్చగొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
Also Read: ప్రభుత్వ కార్యక్రమాలకు.. పార్టీ కార్యక్రమాలకు తేడా లేకుండా పోయింది: టీఆర్ఎస్పై రేవంత్ రెడ్డి ఫైర్
రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించలేదనే కారణంతోనే గులాం నబీ ఆజాద్ అసంతృప్తితో మాట్లాడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. గాంధీ కుటుంబాన్ని గులాం నబీ ఆజాద్ దూషించడాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు.
అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు తేడా లేకుండా పోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులను కూడా అధికార కార్యక్రమాలకు పిలవడం లేదని ఆరోపించారు. అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘించి స్థానిక ప్రజాప్రతినిధులను పిలవడం లేదన్నారు. ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్, బీజేపీలు ప్రలోభ పెడుతున్నాయని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై చర్చించకుండా.. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం ద్వారా టీఆర్ఎస్, బీజేపీలు పబ్బం గడుపుకుంటున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇలా చేయడం ద్వారా ప్రజాప్రతినిధుల జేబులు నిండుతున్నాయే తప్ప మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.