ప్రభుత్వ కార్యక్రమాలకు.. పార్టీ కార్యక్రమాలకు తేడా లేకుండా పోయింది: టీఆర్ఎస్పై రేవంత్ రెడ్డి ఫైర్
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు తేడా లేకుండా పోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులను కూడా అధికార కార్యక్రమాలకు పిలవడం లేదని ఆరోపించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు తేడా లేకుండా పోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులను కూడా అధికార కార్యక్రమాలకు పిలవడం లేదని ఆరోపించారు. అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘించి స్థానిక ప్రజాప్రతినిధులను పిలవడం లేదన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈరోజు గాంధీభవన్లో సమావేశం అయ్యారు. మునుగోడు ఉపఎన్నికపై ప్రచారం, అభ్యర్థి ఎంపికపై చర్చించారు. నియోజకవర్గంలో మండలాల ఇంచార్జ్లుగా ఉన్నవారితో జూమ్ కాల్లో మాట్లాడారు.
అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులను టీఆర్ఎస్, బీజేపీలు ప్రలోభ పెడుతున్నాయని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై చర్చించకుండా.. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం ద్వారా టీఆర్ఎస్, బీజేపీలు పబ్బం గడుపుకుంటున్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇలా చేయడం ద్వారా ప్రజాప్రతినిధుల జేబులు నిండుతున్నాయే తప్ప మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్పై చార్జ్షీట్ రూపొందిస్తామని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తామని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వని కారణంగా నల్గొండకు తీరని నష్టం జరుగుతుందన్నారు. తెలంగాణ మోడల్ అంటే భూ దోపిడీ, అవినీతి చేయడమేనా అని ప్రశ్నించారు. ఆస్తులను విధ్వంసం చేయడమే గుజరాత్ మోడల్ అని విమర్శించారు. తెలంగాణను అక్రమించడానికి మోదీ.. దేశాన్ని అక్రమించడానికి కేసీఆర్ బయల్దేరారని మండిపడ్డారు.
రాహుల్ గాంధీపై ఇటీవల కాంగ్రెస్ను వీడిన గులాం నబీ ఆజాద్ చేస్తున్న విమర్శలపై రేవంత్ రెడ్డి మండిప్డారు. రాజ్యసభ రెన్యువల్ కాలేదని పార్టీ దూషిష్తే ఎవరు క్షమించరని అన్నారు. గులాం నబీ ఆజాద్ ఎవరి కన్నుసైనల్లో పనిచేస్తున్నారని ప్రశ్నించారు. నరేంద్ర మోదీలో ఉన్న మానవత్వం ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గులాం నబీ ఆజాద్ ఎవరిచేతిలో కీలుబొమ్మగా మారారనే విషయం అర్థమవుతందన్నారు. ఆయన వైఖరిని దేశ ప్రజలు అందరూ గమనిస్తున్నారని అన్నారు.