తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను యుక్త వయస్సులో దేశ రక్షణ కోసం పనిచేశానని అంటూ పాస్ పోర్టు బ్రోకరా తనను విమర్శించేదని మండిపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గురువారం గద్వాల నియోజకవర్గంలో జరిగిన పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెసు ఎవరితో పొత్తు పెట్టుకుంటే కేసిఆర్ కు ఎందుకని ఆయన అడిగారు. కేసఆర్ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. తెలంగాణ నెంబర్ వన్ ద్రోహి కేసిఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. 

కేసిఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, రైతు రుణమాఫీ కూడా సరిగా అమలు కాలేదని, తాము అధికారంలోకి వస్తే ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కేసిఆర్ మోడీతో జత కడుతారని ఆయన అన్నారు. ప్రజలను మోసం చేసేందుకే కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని ఆయన అన్నారు. 

తెలంగాణ ద్రోహులకు కేసిఆర్ మంత్రి పదవులు ఇచ్చారని ఆయన విమర్శించారు. తలసాని శ్రీనివాస యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లేనని ఆయన అన్నారు. 

తెలంగాణకు పట్టిన దయ్యం కేసీఆర్‌ అని ఆ దయ్యాన్ని వదిలించేందుకే తమ పార్టీ టీడీపితో జతకట్టిందని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ మాట్లాడారు. టీడీపిని ఆంధ్రా పార్టీ అని విమర్శించిన కేసీఆర్‌కు ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశాలు ఇచ్చింది ఆ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు.