యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 తుది ఫలితాలను ప్రకటించింది. సివిల్స్-2022లో ఇషితా కిషోర్ టాపర్‌గా నిలిచారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 తుది ఫలితాలను ప్రకటించింది. సివిల్స్-2022లో ఇషితా కిషోర్ టాపర్‌గా నిలిచారు. దీంతో ఆమె దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించారు. అయితే సివిల్స్ టాపర్‌గా నిలిచిన ఇషితకు హైదరాబాద్‌తో సంబంధం ఉంది. ఆమె హైదరాబాద్‌లోని బేగంపేటలో జన్మించారు. సివిల్స్ టాపర్‌గా నిలిచిన ఇషిత తెలంగాణ టూడే‌తో మాట్లాడుతూ.. ‘‘నేను హైదరాబాద్‌తో కనెక్ట్ అయ్యాను. నిజానికి నేను అక్కడి బేగంపేటలో జన్మించాను’’ అని పేర్కొన్నారు.

‘‘పరీక్షలో మొదటి ర్యాంక్ సాధించినందుకు నేను నిజంగా ఆనందిస్తున్నాను. ఐఏఎఫ్ అధికారి అయిన మా నాన్నలా దేశానికి సేవ చేయాలని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను. నేను పాలనలో ఎక్కువ భాగం కావాలనుకుంటున్నాను. అందుకే నేను IASని ఎంచుకున్నాను. సివిల్ సర్వీసెస్ చాలా అవకాశాలను ఇస్తుంది’’ అని ఇషిత ఆనందంలో మునిగిపోయారు. ఇక, ఇషిత ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా. 

ఇక, బీహార్‌కు చెందిన ఇషిత.. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్నారు. ఆమె క్యాడర్‌లో తన మొదటి ప్రాధాన్యతగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ (ఐఏఎస్)ని ఎంచుకుని.. దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక, ఇషిత తండ్రి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ కాగా, తల్లి రిటైర్డ్ టీచర్.. వారి నుంచి ప్రేరణ పొందడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే అభిరుచి ఇషితను సివిల్ సర్వీసెస్ చేపట్టేలా చేసింది.

ఇదిలా ఉంటే.. ఇషితా కిషోర్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. ఆమె 2017లో ఢిల్లీ యూనివర్సిటీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశఆరు. దీని తర్వాత, ఆమె రిస్క్ అడ్వైజరీలో ఎర్నెస్ట్ అండ్ యంగ్‌తో కలిసి పనిచేశారు. 

ఇక, సివిల్స్ ఫలితాల్లో తొలి నాలుగు ర్యాంకులను మహిళ అభ్యర్థులే కైవసం చేసుకన్నారు. సివిల్స్ 2022 టాపర్‌గా ఇషితా కిషోర్ నిలిచారు. గరిమా లోహియా.. రెండో ర్యాంకు, ఉమా హారతి.. మూడో ర్యాంకు, స్మృతి మిశ్రా.. నాలుగో ర్యాంకు సాధించారు. ఉమా హారతి తెలంగాణలోని నారాయణపేట ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె. ఉమా హారతి తన నాలుగో ప్రయత్నంలో ఈ ఘనతను సాధించారు. ఇదిలా ఉంటే.. సివిల్ సర్వీసెస్ 2022 మెరిట్ లిస్ట్‌లో మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరిలో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99 మంది, ఓబీసీ నుంచి 263 మంది, ఎస్సీ నుంచి 154, ఎస్టీ నుంచి 72 మంది ఉన్నారు. వీరిలో సివిల్స్ లో అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్ కు 180 మంది, ఐపీఎస్ కు 200 మంది, ఐఎఫ్ఎస్ కు 38 మందిని ఎంపిక చేశారు.