శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్: చంచల్గూడ్ జైలుకు తరలింపు
కిట్టీ పార్టీల పేరుతో డబ్బులు వసూలు చేసిన శిల్పా చౌదరికి ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ కోర్టులో శిల్పా చౌదరిని పోలీసులు హాజరు పర్చారు.
హైదరాబాద్: కిట్టీ పార్టీల పేరుతో ప్రముఖుల నుండి డబ్బులు వసూలు చేసిన కేసులో అరెస్టైన Shilpa Chowdaryకి ఉప్పర్పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మంగళవారం నాడు శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. బ్యాంకు లాకర్లను తెరిచారు. బ్యాంకు లాకర్లలో నగదు లభ్యం కాలేదు. కస్టడీ పూర్తి కావడంతో ఇవాళ ఉదయం ఉప్పర్పల్లి కోర్టులో నార్సింగి పోలీసులు ప్రవేశ పెట్టారు. శిల్సా చౌదరికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమెను చంచల్గూడ మహిళా జైలుకు తరలించారు పోలీసులు
చంచల్గూడ మహిళా జైలు నుండి ఆమెను నిన్న తమ కస్టడీలోకి తీసుకొన్నారు పోలీసులు. భర్త Srinivas సమక్షంలో Axis బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి బ్యాంకు అకౌంట్లను పోలీసులు తెరిచారు. ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా శిల్పా చౌదరి జాగ్రత్తలు తీసుకొంది . అయితే ప్రముఖుల నుండి వసూలు చేసిన డబ్బులను మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పెట్టుబడులుగా పెట్టినట్టుగా శిల్పా చౌదరి పోలీసుల విచారణలో వెల్లడించారని సమాచారం.
kitty పార్టీల పేరుతో పలువురిని మోసం చేసినట్టుగా శిల్పా చౌదరిపై కేసులు నమోదయ్యాయి. సినీ నటుల కుటుంబాలతో పాటు పోలీస్ అధికారులు, వీఐపీలను లక్ష్యంగా చేసుకొని శిల్పా చౌదరి డబ్బులను వసూలు చేసిందని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన శిల్పా చౌదరిని గత వారంలో మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. అయితే పోలీస్ కస్డడీలో ఆమె నోరు విప్పలేదు. అంతేకాదు శని, ఆదివారాలు కూడా కావడంతో బ్యాంకు లావాదేవీలను తెలుసుకొనే అవకాశం లేకుండా పోయిందని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని వారి నుండి డబ్బులు వసూలు చేసేందుకు కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసేదని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయాలను వసూలు చేసిందని ఆమెపై పలువురు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్న శిల్పా చౌదరి పోలీసులకు చుక్కలు చూపించింది. ఎన్నారై ప్రతాప్ రెడ్డి, మల్లారెడ్డి, రాధికారెడ్డిల నుండి తనకు డబ్బులు రావాల్సి ఉందని శిల్పా చౌదరి పోలీసుల విచారణలో తెలిపిందని సమాచారం.శిల్పా చౌదరి చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్నారై ప్రతాప్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఎన్నారై ప్రతాప్ రెడ్డి మాత్రం పోలీసులకు భిన్నమైన సమాధానం చెప్పారని తెలుస్తోంది. తనకే శిల్పా చౌదరి డబ్బులు ఇవ్వాలని చెప్పారని తెలుస్తోంది.
పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆ తర్వాత పలువురు వరుసగా శిల్పా చౌదరి ద్వారా తాము మోసపోయినట్టుగా పోలీసులను ఆశ్రయించారు. రోజుకొకరు శిల్పా చౌదరి తమ వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసపోయామని ఫిర్యాదులు చేశారు.మరో వైపు తనకు డబ్బులు ఇచ్చిన వారు తనకు డబ్బులు తిరిగి ఇస్తే బాధితులకు డబ్బులు ఇస్తామని శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం.శిల్పా చౌదరి పలువురు సినీ హీరోల కుటుంబాలను కూడా మోసం చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.