మోడీ వస్తే ప్రోటోకాల్ పాటించలేదు.. ఆయనకు రాజకీయాలంటే సర్కస్సే : కేసీఆర్పై స్మృతీ ఇరానీ ఫైర్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. రాష్ట్రానికి ప్రధాని వస్తే కేసీఆర్ కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని ఆమె దుయ్యబట్టారు.
8 ఏళ్లలో దేశం ఎంతో లబ్ధి పొందిందన్నారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ (smriti irani) . హైదరాబాద్ నోవాటెల్ లో జరుగుతోన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో (bjp national executive meeting) ఆమె ప్రసంగిస్తూ.. 11 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు అందాయని ఆమె అన్నారు. ఎస్సీ, ఎస్టీలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలు అద్బుతమని స్మృతీ ఇరానీ ప్రశంసించారు. దేశంలో అవినీతి నిర్మూలనకు ప్రధాని మోడీ (narendra modi) కృషి చేస్తున్నారని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, కశ్మీర్ లోని బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని స్మృతీ ఇరానీ మండిపడ్డారు. రాజ్యాంగ ఉల్లంఘనకు కేసీఆర్ (kcr) మారు పేరని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణకు ప్రధాని వస్తే.. కేసీఆర్ ప్రోటోకాల్ పాటించలేదని స్మతీ ఇరానీ మండిపడ్డారు. కేసీఆర్ విధానాలు దేశం ఎప్పుడూ ఆమోదించలేదని.. ఆయనకు రాజకీయాలంటే సర్కస్ అయ్యాయని ఆమె దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను తాము ఫాలో అవ్వమని స్మృతీ ఇరానీ అన్నారు.
అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జాతీయ పదాధికారుల సమావేశం హెచ్ఐసీసీలో జరిగింది. ఈ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే మీడియాతో మాట్లాడారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించబడనున్నట్టుగా తెలిపారు. అందులో ఒకటి రాజకీయ ప్రతిపాదన కాగా, రెండోవది ఆర్థిక వ్యవస్థ, పేదల సంక్షేమానికి సంబంధించినదని చెప్పారు. పార్టీ పదాధికారుల సమావేశంలో ఈ ప్రతిపాదనల ముసాయిదాపై చర్చించినట్టుగా చెప్పారు.
ALso Read:‘‘హర్ ఘర్ తిరంగా’’తో దేశవ్యాప్తంగా ప్రజల్లోకి బీజేపీ.. తెలంగాణపై ప్రకటన ఉంటుంది: వసుంధరా రాజే
'హర్ ఘర్ తిరంగా' వంటి అనేక కొత్త కార్యక్రమాలను పార్టీ ప్రారంభిస్తుందని వసుంధరా రాజే చెప్పారు. 'పన్నా ప్రముఖ్'ని మరింత బలోపేతం చేయనున్నట్టుగా చెప్పారు. తెలంగాణలో పార్టీకి సంబంధించి కూడా బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రకటన వెలువడుతుందన్నారు. ఉదయ్పూర్లో ఇటీవల జరిగిన హత్య, నూపుర్ శర్మ వివాదాస్పద ప్రకటనపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు.. రాజకీయ పరిష్కారానికి సంబంధించిన అంశాలను NEC నిర్ణయిస్తుందని వసుంధర రాజే చెప్పారు.
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ఎన్నికలు, రాంపూర్, అజంగఢ్, త్రిపుర ఉప ఎన్నికలపై కూడా ఈ సమావేశాల్లో చర్చించినట్లు వసుంధరా రాజే చెప్పారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు.. పెద్ద ఉద్యమంగా చేసేందుకు బీజేపీ Har Ghar Tirangaను (ప్రతి ఇంటికి జాతీయ పతాకం) ప్రారంభించనుందని ఆమె చెప్పారు. ఈ ప్రచారం సందర్భంగా 20 కోట్ల మందికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.