మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నైతిక విలువలు, జ్ఞానం లేకుండా బతికున్నవారికి సమాధి కట్టే సంప్రదాయం టీఆర్ఎస్ తీసుకొచ్చిందన్నారు.
టీఆర్ఎస్పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనుగోడులో అధికార పార్టీ పూర్తిగా దిగజారిందన్నారు. ఉపఎన్నికలో ఒక ఊరికి సీఎం ఇన్ఛార్జ్గా వుండటం గతంలో లేదని, భవిష్యత్లో జరగదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ దత్తత తీసుకుంటామని కేసీఆర్, కేటీఆర్ హామీ ఇస్తారని.. తర్వాత మర్చిపోతారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాలతో ఎన్నికల్లో తొండి చేయాలనుకుంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. నైతిక విలువలు, జ్ఞానం లేకుండా బతికున్నవారికి సమాధి కట్టే సంప్రదాయం టీఆర్ఎస్ తీసుకొచ్చిందన్నారు. జేపీ నడ్డా ఇక్కడ పోటీ చేసి గెలిచారా ... ఆయన సమాధి కట్టే నీచ, నికృష్ట చర్యలకు దిగుతారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
కాగా... మునుగోడు ఉపఎన్నికకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ ప్రధాన పార్టీల ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది. అన్నిపార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడమే కాదు ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసే ప్రచారాన్ని కూడా అదేస్థాయిలో చేపట్టాయి. అయితే ఈ ప్రచారం కాస్త హద్దులు దాటి పరాకాష్టకు చేరుకుంది. కేంద్ర మంత్రి, బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయాడంటూ ఏకంగా అయన సమాధి కట్టారు ప్రత్యర్థులు. ఈ వ్యవహారం మునుగోడులోనే కాదు యావత్ తెలంగాణ సంచలనంగా మారింది.
ALso REad:మనుగోడు ప్రచారం పరాకాష్టకు ... జేపి నడ్డాకు సమాధికట్టిన ప్రత్యర్థులు
నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ సమస్యను పూర్తిగా తొలగించేందుకు చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటుచేస్తామని 2016 లో కేంద్ర మంత్రి జేపి నడ్డా హామీఇచ్చారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 8.2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా రీసెర్చ్ సెంటర్ హామీ నేరవేరకపోవడంతో దీన్ని మునుగోడు ఉపఎన్నికలో వాడుకోవాలని బిజెపి ప్రత్యర్థి పార్టీలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ప్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ కోసం కేటాయించిన స్థలంలో జేపి నడ్డా ప్లెక్సీలతో సమాధి ఏర్పాటుచేసారు.
