తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విమానాల్లో తిరుగుతూ తెలంగాణలో సంపాదించిన డబ్బును కేసీఆర్ దేశమంతా పంచుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
తెలంగాణను అప్పుల పాటు చేసి కేసీఆర్ విమానాలు కొన్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆదివారం ఆయన ప్రచారం నిర్వహించారు. తెలంగాణ పోరాటంలో 1200 మంది ప్రాణత్యాగాలు చేశారని.. ఇవన్నీ కేసీఆర్ కుటుంబం కోసమా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. విమానాల్లో తిరుగుతూ తెలంగాణలో సంపాదించిన డబ్బును కేసీఆర్ దేశమంతా పంచుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎక్కడ ఖాళీ భూమి వుంటే అక్కడ టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
అంతకుముందు సోమవారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ... మునుగోడు ఉప ఎన్నికను తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవవానికి కల్వకుంట్ల కుటుంబం అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. మునుగోడు ప్రజలు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారెవరూ ప్రస్తుతం టీఆర్ఎస్ లో లేరన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ ఏర్పడిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 1200 మంది అమరుల త్యాగాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు.
ALso REad:తెలంగాణ ఆత్మగౌరవానికి, కేసీఆర్ అహంకారానికి మధ్య జరిగే పోరు: మునుగోడు బైపోల్ పై కిషన్ రెడ్డి
కుటుంబ పాలనను ప్రజలపై రుద్దుతున్న కల్వకుంట్ల కుటుంబానికి బుద్ది చెప్పాలని కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట గలిపేలా తన పార్టీపేరులో తెలంగాణ ను కూడ తొలగించారని కేసీఆర్ పై కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేసీఆర్ సర్కార్ పనిచేయడం లేదన్నారు. తెలంగాణలో సమస్యలు అన్నీ పరిష్కరించినట్టుగా టీఆర్ఎస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కేసీఆర్ అహంకారానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు మునుగోడులో టీఆర్ఎస్ కు బుద్ది చెబుతారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అవినీతి కుంభకోణాలకు ప్రజలే మీటర్లు పెట్టారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
