తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు . మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ వరకు  తాను కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతానని కిషన్ రెడ్డి  చెప్పిన సంగతి తెలిసిందే. 

తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తదితరులు ఘనస్వాగతం పలికారు. అయితే కిషన్ రెడ్డి వెంట బండి సంజయ్ లేకపోవడం చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసే హైదరాబాద్‌కు వస్తామని మీడియాకు సమాచారం వుంది. అలాంటిది కిషన్ రెడ్డి ఒక్కరే రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం నేపథ్యంలో చివరి నిమిషంలో బండి సంజయ్ హస్తినలోనే ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు.. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ వరకు తాను కేంద్ర మంత్రి పదవిలో కొనసాగుతానని కిషన్ రెడ్డి చెప్పారు. న్యూఢిల్లీలో బుధవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని పార్టీ తనకు కేటాయించడంతో తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను తాను సమర్థవంతంగా నిర్వహించనున్నట్టుగా చెప్పారు. పార్టీ నిర్ణయాలను అందరూ పాటించాల్సిందేనని కిషన్ రెడ్డి చెప్పారు. ఒక్కరికి ఒక్క పదవే అనేది బీజేపీ విధామన్నారు. ఈ విధానం మేరకు తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిషన్ రెడ్డి చెప్పారు.

ALso Read: అసంతృప్తి లేదు, అప్పటివరకు మంత్రినే: మీడియా చిట్ చాట్ లో కిషన్ రెడ్డి

కాగా.. తెలంగాణ బీజేపీలో మంగళవారం అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ రాజీనామా చేశారు. ఆ వెంటనే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. మరోవైపు తనకు బీజేపీలో సరైన ప్రాధాన్యత లభించడం లేదంటూ అలకబూనిన మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సైతం కీలక బాధ్యతలను కట్టబెట్టింది అధిష్టానం.

తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పార్టీ పెద్దలు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు.