Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు కేంద్రం చేసిందిదే.. కేటీఆర్‌కు కౌంటర్, చిట్టా విప్పిన కిషన్ రెడ్డి

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్రం ఇచ్చిన నిధుల చిట్టా విప్పుతూ ట్వీట్ చేశారు. 

union minister kishan reddy counter to telangana minister ktr over center funds
Author
First Published Jan 8, 2023, 9:33 PM IST

తెలంగాణలో బీజేపీ , బీఆర్ఎస్ మధ్య నిధులకు సంబంధించిన వార్ నడుస్తోంది. కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమి లేదంటూ మంత్రి కేటీఆర్ లెక్కలు చెబుతున్నారు. తాను చెప్పింది తప్పయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల చిట్టా విప్పారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు. వరంగల్ , కరీంనగర్ పట్టణాలకు రూ.392 కోట్ల నిధులు విడుదల చేశామని.. అలాగే అమృత్ పథకంలో 12 పట్టణాలకు రూ.833.36 కోట్లు విడుదల చేశామని ఆయన వెల్లడించారు.

అలాగే తెలంగాణలోని 143 పట్టణాలలో రూ.2780 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. దీనితో పాటు పీఎంఏవై అర్భన్ పథకంలో భాగంగా తెలంగాణకు 2,49,465 ఇళ్లు మంజూరు చేశామని ఆయన తెలిపారు. వీటి నిర్మాణానికి ఇప్పటికే రూ.3,128.14 కోట్లు విడుదల చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 2,15,443 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 

ALso Read: తెలంగాణపై ఎందుకీ వివక్ష.. పట్టణాల అభివృద్ధికి నిధులివ్వండి : కేంద్రానికి కేటీఆర్ లేఖ

అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో 3 లక్షల 68 వేల కోట్లు పంపామన్నారు. కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది లక్షా 68 వేల కోట్లేనని కేటీఆర్ దుయ్యబట్టారు. తాను చెప్పింది తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. కిషన్ రెడ్డి చెప్పింది తప్పయితే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా అని కేటీఆర్ సవాల్ విసిరారు. నీకు పదవికి రాజీనామా చేసే దమ్ము ఎలాగూ లేదు.. తెలంగాణ ఉద్యమంలో కూడా రాజీనామా చేయలేని అసమర్ధుడివంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం తెలంగాణ ప్రజలకైనా క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు దేశానికి సేవలందించిన 14 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోడీ చేసిన అప్పు ఎక్కువ అని కేటీఆర్ ఆరోపించారు. 

రెండు జాతీయ పార్టీలు అబద్ధాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. పెట్టుబడి ద్వారా సంపద సృష్టించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని కేటీఆర్ తెలిపారు. మోడీ పాలనలో దేశాన్ని దోచుకున్న వాళ్లు మాత్రమే బాగుపడ్డారని మంత్రి దుయ్యబట్టారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా.. జెండా, ఎజెండా, మనుషులు, డీఎన్ఏ మారలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios