కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తన తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నారు. బీపర్జాయ్ తుఫాను సహాయక చర్యలపై నిరంతరాయంగా సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయ్యింది. బీపర్జాయ్ తుఫాను కారణంగా తన పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ తెలిపింది. రేపు గుజరాత్లోని కచ్ తీరంలో బిపర్జాయ్ తుఫాన్ తీరం దాటనుంది. ఈ క్రమంలో తుఫాను సహాయ చర్యలపై ఆయన నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ పర్యటనను అమిత్ షా రద్దు చేసుకున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే హైదరాబాద్ పర్యటన లేకుండా నేరుగా ఖమ్మం సభకైనా రావాలని రాష్ట్ర బీజేపీ నేతలు ఆయనను కోరారు.
కాగా.. కొద్దినెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలను , కేడర్ను సమాయత్తం చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 15న అమిత్ షా ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. బుధవారం అర్ధరాత్రికి అమిత్ షా హైదరాబాద్ రావాల్సి వుంది.
ALso Read: అమిత్ షా తెలంగాణ పర్యటనపై సందిగ్థత .. కుదిరితే మార్పులు, లేదంటే రద్దే ..?
గురువారం ఉదయం ముఖ్యనేతలతో సమావేశం కావడంతో పాటు దర్శకుడు రాజమౌళిని ఆయన కలవాల్సి వుంది. సాయంత్రం హెలికాఫ్టర్లో భద్రాచలానికి చేరుకుని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. ఖమ్మం నగరంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి.. బహిరంగ సభలో పాల్గొనాల్సి వుంది. అయితే ప్రస్తుతం బిపర్జాయ్ తుఫాన్ నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటనపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
