Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు.. ముందస్తు ఎన్నికలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. మంగళవారం తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్ షా.. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని వ్యాఖ్యానించారు. 

Union Home minister Amit shah key Comments on early assembly elections  in Telangana
Author
Hyderabad, First Published Dec 22, 2021, 4:16 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. మంగళవారం తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమైన అమిత్ షా.. తెలంగాణలో ఎన్నికలు (Telangana Assembly Elections) ఎప్పుడైనా రావొచ్చని వ్యాఖ్యానించారు. కేసీఆర్ (KCR) ముందస్తు ఎన్నికలు వెళ్లొచ్చని కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్‌ను పూర్తిగా నమ్మలేమని.. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి మరింతగా సమాయత్తం కావాలని కూడా సూచించారు. తనకున్న ఇన్‌పుట్స్ ఆధారంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో గత కొద్ది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన బీజేపీ శ్రేణులను సంసిద్ధంగా ఉంచేలా చేయడం కోసమే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పుకొస్తున్నారు. 

అయితే అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ సందర్భంగా కూడా టీఆర్‌ఎస్‌పై గట్టిగా పోరాడాలని చెప్పారు. ఈ భేటీ సందర్భంగా నల్గొండలో బండి సంజయ్ పర్యటన సంద్భరంగా చోటుచేసుకున్న పరిణామాలు, బీజేపీ కార్యకర్తలకు గాయాలు కావడం వంటి అంశాలను తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షాకు వివరించారు. ఈ క్రమంలోనే తాను తెలంగాణకు వస్తానని, రెండు రోజుల పర్యటిస్తానని అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందన వచ్చిందని, వెంటనే రెండో విడత యాత్రను కూడా ప్రారంభించాలని అమిత్ షా సూచించారు. ప్రజలకు వాస్తవాలు వివరించాలని కూడా మార్గనిర్దేశనం చేశారు. 

అంతేకాకుండా తెలంగాణలో గట్టిగా పోరాడాలని కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశనం చేశారు. కేసీఆర్ అసత్యప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలపై అమిత్ షా సీరియస్‌ అయ్యారనే తెలుస్తోంది. రాష్ట్ర మంత్రుల చావు డప్పు కొట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించినట్టుగా సమాచారం. ఇక, తెలంగాణ బీజేపీ నేతలతో  భేటీ తర్వాత అమిత్ షా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి‌తో కొన్ని నిమిషాల పాటు ప్రత్యేకంగా సమావేశమైనట్టుగా తెలుస్తోంది. 

గతంలో కూడా సీఎం కేసీఆర్.. ఐదేళ్లు పూర్తికాక ముందే వ్యుహాత్మకంగా ముందస్తు ఎన్నికలు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో కేసీఆర్ ప్లాన్ సఫలీకృతం అయింది. అయితే ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి.. టీఆర్‌ఎస్ 17 స్థానాల్లో 9 చోట్ల మాత్రమే గెలుపొందింది. బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారినట్టుగా కనిపించింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి కావడం.. మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారా అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో విస్తృతంగా సాగుతున్న సంగతి తెలిసిందే.

కొద్ది రోజులుగా కేంద్రం Vs రాష్ట్రం..
తెలంగాణలో గత కొద్ది నెలలుగా టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తర్వాత ఇది మరింతగా పెరిగింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపొందడంతో బీజేపీలో జోష్ నింపింది. అయితే ఇదే సమయంలో గెలుపోటములు సహజమని పేర్కొన్న టీఆర్‌ఎస్.. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్రం తీరుపై విమర్శలు ప్రారంభించింది. ఇందుకు బీజేపీ కూడా అదే విధంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. 

ఈ క్రమంలోనే కేంద్రం తెలంగాణ అన్యాయం చేస్తుందని ఏకంగా కేసీఆర్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో కూర్చొని కామెంట్స్ చేశారు. అంతేకాకుండా పార్లమెంట్ సమావేశాల్లో కూడా టీఆర్‌ఎస్ ఎంపీలు ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరి చెప్పాలంటూ పార్లమెంట్ వేదికగా పోరాటం చేశారు. అంతేకాకుండా తెలంగాణకు అన్యాయం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. 

అంతేకాకుండా కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. కేంద్రం వైఖరికి నిరసనగా  మరోవైపు రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైంది. అయితే ఈ సమావేశం అనంతరం పీయూష్ గోయల్ వైఖరిపై టీఆర్‌ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి హరీష్ రావు స్పందిస్తూ తెలంగాణ మంత్రులకు పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు పీయూష్ గోయల్ మాత్రం తెలంగాణ తీరును తప్పుబట్టారు. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్‌ కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు.ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారన్నారు. రైతులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం గందరగోళపరుస్తోందని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios