పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకొంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీశాఖ రెండో దశ అనుమతులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు
హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకొంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీశాఖ రెండో దశ అనుమతులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని నీటి పారుదల శాఖాధికారులు చెబుతున్నారు. మరో వైపు ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ఇక యుద్ద ప్రాతిపదికన చేపట్లాలని తెలంగణ సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ, అటవీ శాఖ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులను మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుండి శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్రానికి సమాచారం అందింది. ఈ మేరకు కేంద్ర అటవీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రావణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు అనుమతిలిచ్చినందుకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టుకు అనుమతులు వచ్చేలా కృషి చేసిన సాగు నీటి పారుదల ప్రాజెక్టు అధికారులు, అటవీశాఖాధికారులను కేసీఆర్ అభినందించారు.