భద్రాద్రి జిల్లాలో విషాదం: వేటగాళ్ళ ఉచ్చులో పడి ఇద్దరు గిరిజనుల మృతి
అటవీ జంతువుల కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు గిరిజనులు మృత్యువాతపడిన విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
కొత్తగూడెం: అడవి జంతువుల కోసం వేటగాళ్ళు ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్ గురయి ఇద్దరు గిరిజనులు మృత్యువాతపడ్డారు. ఈ విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం మాదారం అటవీప్రాంతంలో వేటగాళ్లు జంతువుల కోసం విద్యుత్ తీగలు అమర్చారు. అయితే కొందరు గిరిజనులు కూలీ పనులకు ఈ ప్రాంతం గుండానే వెళుతుండగా విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ గురయ్యాయి. ఇలా కరెంట్ షాక్ కు గురయి ఇద్దరు గిరిజనులు మృతి చెందారు.
read more వారంలో పెళ్లి.. బండరాయితో కొట్టుకుని, యువకుడి ఆత్మహత్య..!
మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గిరిజనులిద్దరు మృతిచెందినట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు మొగరాలకుప్పకు చెందిన పాయం జాన్బాబు (24), కూరం దుర్గారావు(35)గా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదకర రీతిలో నిత్యం మనుషులు తిరిగే ప్రాంతంలో విద్యుత్ తీగలు ఏర్పాటుచేసిన వేటగాళ్ళపై చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కుటుంబాన్ని పోషించేవారు ప్రమాదవశాత్తు మరణించారు కాబట్టి తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత గిరిజన కుటుంబాలు వేడుకుంటున్నాయి.