రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు
Heavy Rains: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు మోస్తారు నుంచి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. కాగా, కుతుబుల్లాపూర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది.
Hyderabad: దేశంలోని చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పిరిధి ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. దక్షిణాదిన కూడా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. అయితే, రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తెలంగాణలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు
తెలంగాణలో గత రెండు రోజులుగా వానలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు వర్షాలు పడగాయని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి వర్షాలు కురిశాయని, రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) కూడా అంచనా వేసింది. గత 24 గంటల్లో ఆదిలాబాద్, మంచిర్యాలు, నారాయణపేట జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లిలో చాలా తేలికపాటి వర్షాలు కురుస్తాయనీ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మంలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
గ్రేట్ హైదరాబాద్ ప్రాంతంలో, కుత్బుల్లాపూర్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయనీ, షేక్పేట్, మారేడ్పల్లి, సికింద్రాబాద్తో సహా చాలా ప్రాంతాల్లో చాలా తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జీహెచ్ఎంసీలో గరిష్ట ఉష్ణోగ్రత 30-32 డిగ్రీల మధ్య, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు..
ఏపీలో రానున్న మూడు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదివారం నైరుతి బంగాళాఖాతం వెంబడి ఉత్తర శ్రీలంక తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నందున, అమరావతి వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల వాతావరణ సూచనలను జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో పలుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఈ మండలంలో ఒకటి రెండు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం నుంచి బుధవారం వరకు దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, రాయలసీమలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఉత్తరభారతంలో వర్ష బీభత్సం..
ఉత్తర భారతంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. అక్కడి చాల ా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో 9 మంది మరణించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సోమవారం నాడు దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్ లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.