తెలంగాణలో మరో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య..
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయిన నేపథ్యంలో మరో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, ఫెయిలయ్యామని మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరో ఇద్దరు Inter students బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థి (17) ఎంపీసీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశాడు. ఫలితాల్లో ఐదు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో, భయపడిన ఆ విద్యార్థి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని suicide చేసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ అయిన భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మలక్ పేట ప్రాంతానికి చెందిన మరో విద్యార్థిని (19) ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె మంగళవారం రాత్రి తన గదిలో ఉరివేసుకొని మృతి చెందింది.
బలవన్మరణాలు వద్దు.. బండి సంజయ్
అయితే, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల క్షణికావేశంలో, మనస్తాపంతో బలవన్మరణాలకు పాల్పడొద్దని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
తెలంగాణ : మార్కులు తగ్గాయని, ఫెయిల్ అయ్యామని.. ఇప్పటి వరకు ఐదుగురు ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్య
కాగా, జూన్ 28, మంగళవారం ఉదయం తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తంగా 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఇంటర్ ఫలితాల్లో ఈసారి కూడా అమ్మాయిలే పైచేయి సాధించారు. ఫలితాలు విడుదలైన తరువాత తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని కొందరు... ఫెయిలయ్యామని మరికొందరూ మనస్థాపంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్షణికావేశంలో తీసుకునే ఈ నిర్ణయంతో తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారు.
హైదరాబాద్ చింతల్ బస్తికి చెందిన ఇంటర్ విద్యార్థి గౌతమ్ కుమార్ పరీక్షల్లో పాస్ అయ్యాడు. కానీ అతను అనుకున్న దానికంటే తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో మనస్థాపానికి గురయ్యాడు. ఆ ఆవేదనతో ఇంట్లోనే తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని సైఫాబాద్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నగర శివార్లలోని కాటేదాన్ లోనూ ఒక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.