కొమ్రంబీం జిల్లాలో ఎన్కౌంటర్... ఇద్దరు మావోయిస్టులు మృతి
కొమురంబీమ్ అసిఫాబాద్ జిల్లా అడవుల్లో తుపాకుల మోత మోగింది.
కాగజ్నగర్: కొమురంబీమ్ అసిఫాబాద్ జిల్లా అడవుల్లో తుపాకుల మోత మోగింది. జిల్లాలోని కాగజ్ నగర్ మండల పరిధిలోని కదంబా అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
ఆసిఫాబాద్ జిల్లాలో నక్సలైట్ల సంచారం ఎక్కువయిందన్న సమాచారంతో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేపట్టారు. ముఖ్యంగా ప్రాణహిత నదీ తీరం వెంట డిఎస్పీ స్వామి పర్యవేక్షణలో 8 గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలోనే కదంబా అడవుల్లో మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగారు. దీంతో పోలీసులు కూడా కాల్పులు జరపగా ఇద్దరు మావోయిస్టులు చనిపోగా కీలక నాయకులు కొందరు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
READ MORE సర్పంచ్తో ఎమ్మెల్యే తండ్రి వాగ్వాదం: పోలీసులకు ఫిర్యాదు
కేబీఎం (కుమురం భీం, మంచిర్యాల) డివిజన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తో పాటు వర్గీస్, కాంతీ లింగవ్వ, మరికొందరు మావోలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు కూంబింగ్ మరింత విస్తృతంగా చేపట్టారు. సంఘటన స్థలంలో మావోలకు సంబంధించిన రెండు తుపాకులు,బ్యాగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.