రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు కన్నుమూసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు కన్నుమూసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. సరుకుల కోసం ద్విచక్రవాహనంపై వచ్చి తిరిగి వెళ్తుండగా... రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే కన్నుమూశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... అశ్వారావుపేట మండలంలోని ఆదివాసీ కొండరెడ్ల గ్రామమైన గోగులపుడికి చెందిన అన్నదమ్ములు కోపాల తమ్మిరెడ్డి(40), కోపాల సత్తిరెడ్డి(34)తో పాటు గోగుల పండారెడ్డి బుధవారం అశ్వారావుపేటలో జరిగే సంతకు వచ్చారు. సరుకులు కొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. కన్నాయిగూడెం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఒకటి వీరి వాహనాన్ని ఢీ కొట్టింది.
దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోగానే తమ్మిరెడ్డి, సత్తిరెడ్డి సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరో యువకుడు పండారెడ్డిని అశ్వారావుపేట ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. మృతుడు తమ్మిరెడ్డికి ఇద్దరు పిల్లలు, సత్తిరెడ్డికి భార్య, కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.