హైదరాబాద్ శివారులో విషాదం... రెండు నిండు ప్రాణాలకు బలితీసుకున్న ఈత సరదా
ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈసీ వాగు కత్వలో ఈతకు దిగి ఇద్దరు యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.
మొయినాబాద్: ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. వాగులో దిగి ఈత కొడుతూ బాగా లోతులోకి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ బండలం సజ్జలపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సరదాగా ఈత కొట్టడానికి వెంకటాపూర్ సమీపంలోని ఈసీ వాగు కత్వలో దిగారు. అయితే ఇద్దరు యువకులు బాగా లోతులోకి వెళ్లడంతో మునిగిపోయి గల్లంతయ్యారు. మరో యువకుడు మాత్రం నీటిలోంచి సురక్షితంగా బయటకు వచ్చాడు.
read more మహబూబ్ నగర్: ఒకే గదిలో వివాహిత, యువకుడు ఆత్మహత్యాయత్నం... నిండు గర్భిణి మృతి
ప్రాణాలతో బయటపడ్డ యువకుడు గ్రామంలోకి వెళ్లి తన స్నేహితులిద్దరు నీటమునిగి గల్లంతయిన విషయాన్ని తెలిపాడు. దీంతో అందరూ కలిసి వెళ్లి వెతికినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందం సాయంతో యువకులిద్దరి కోసం గాలింపు చేపట్టారు. దీంతో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
యువకుల మృతితో సజ్జన్ పల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ప్రాణాలు కోల్పోయిన యువకుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నీటిలోంచి బయటకు తీసిన యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.