సిపిఎం-టిడిపిల విచిత్రబంధం
టిడిపి, సిపిఎం లది విచిత్ర బంధం
ఆంధ్రలో టిడిపి మీద కత్తులు దూస్తున్న సిపిఎం
తెలంగాణాలో సిపిఎంతో చేతులు కలిపిన టిటిడిపి
సిపిఎం, తెలుగుదేశం స్నేహం చిత్రమయినది. ఈ రెండుపార్టీలు ఎపుడు కలుసుంటాయో, కత్తులు దూసుకుంటాయో చెప్పడం కష్టం. ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిపిఎం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపితే, తెలంగాణాలో ఇదే పార్టీ టిఆర్ ఎస్ మీద సాగిస్తున్న పోరాటానికి తెలుగుదేశం మద్ధతునిస్తున్నది.
ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడి విధానాలకు వ్యతిరేకంగాప్రచారం చేస్తూ ఆంధ్రా సిపిం కార్యదర్శి పి.మధు రాష్ట్రమంతా కలియతిరుగుతున్నారు. అనేక చోట్ల ప్రజా ఉద్యమాలను నడిపిస్తున్నది సిపిఎం పార్టీయే. అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారమని, జగన్ కంటే బిగ్గరగా అరిచేది సిపిఎం పార్టీయే, పార్టీ జాతీయ నాయకులు ఏచూరి సీతారాం, బృందాకారత్ రాష్ట్రం పర్యటించి ప్రత్యేక హోదా ను విస్మరించినందుకు ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడిని,నిరాకరించినందుకు ప్రధాని మోదీని తీవ్రంగా విమర్శించారు.
ఆంధ్రలో రెండుపార్టీల మధ్య వైరం ఇలా ఉంటే, తెలంగాణలో పరిస్థితి పూర్తిగా దీనికి భిన్నం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం టిఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతి రేకంగాసాగిస్తున్న మహాజన పాదయాత్రకు తెలంగాణా తెలుగుదేశం పూర్తి మధ్దతు ప్రకటించింది. అంతేకాదు, ఈ యాత్రను విజయవంతం చేసే బాధ్యతను కూడా స్వీకరించి,కార్యకర్తలను పురమాయిస్తున్నది.
సోమవారం నాడు సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో కి ప్రవేశించినపుడు తెలుగుదేశం సాదరంగా ఆహ్వానించింది. తెలంగాణా పార్టీ వర్కింగ్ ప్రెశిడెంట్ , ఎమ్మెల్యే ఎ రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేటకు వెళ్లి స్వాగతం పలికారు. అంతటితో ఆగలేదు, వీరభద్రం యాత్ర పొడవునా ప్రతి గ్రామంలో తెలుగుదేశం శ్రేణులు సిపిఎం నేతకు ఘన స్వాగతం పలుకుతాయని, యాత్రలోపాలుపంచుకుంటాయని చెప్పారు.
జండాతో నిమిత్తం లేకుండా ప్రజా సమస్యల మీద జరిగే పోరాటాలన్నింటికి టిడిపి మద్ధతునిస్తుందని కూడా సమర్థించుకున్నారు. ఆంధ్రాలో సిపిఎం చేస్తున్న పోరాటాల సంగతేమిటో?