హైదరాబాద్ నుంచి ఏపీకి ‘లహరి’ స్లీపర్ బస్సులు... నేటి నుంచి అందుబాటులోకి, టైమింగ్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ లహరి సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఇవి హైదరాబాద్- కాకినాడ, హైదరాబాద్- విజయవాడ రూట్లలో రాకపోకలు సాగించనున్నాయి.
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణీకుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి పది అధునాతన ‘‘లహరి’’ బస్సులు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో పూర్తి స్లీపర్ బస్సులు 4 కాగా, 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులు వున్నాయి. ఇవి హైదరాబాద్- కాకినాడ, హైదరాబాద్- విజయవాడ రూట్లలో రాకపోకలు సాగించనున్నాయి. బుధవారం సాయంత్రం కేపీహెచ్బీ కాలనీ బస్స్టాప్ వద్ద టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభించనున్నారు.
లహరి బస్సులు ప్రయాణ వేళలు:
కాకినాడ వైపు వెళ్లే బస్సులు బీహెచ్ఈఎల్ నుంచి ప్రతిరోజు రాత్రి 7.45, 8.30 గంటలకు బయలుదేరుతాయి.అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్ కు ప్రతిరోజూ రాత్రి 7.15 గంటలకు, 7.45 గంటలకు తిరుగు ప్రయాణం అవుతాయి.
ఇక విజయవాడ విషయానికి వస్తే.. ప్రతిరోజూ మియాపూర్ నుంచి ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు.. రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి ప్రతిరోజూ ఉదయం 10.15, 11.15.. మధ్యాహ్నం 12.15 గంటలకు, రాత్రి 12.00, 12.45 గంటలకు హైదరాబాద్కు బయల్దేరతాయి.
బస్సులో ప్రత్యేకతలు:
లహరి స్లీపర్ బస్సుల్లో లోయర్ బెర్తులు 15, అప్పర్ బెర్తులు 15 వుంటాయి. ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ పాయింట్, వైఫై, సీసీ కెమెరాలు, గమ్యస్థానాల వివరాలు తెలిపేందుకు బస్సుకు ముందు వెనుక ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేశారు.