హైదరాబాద్లో పరుగులు పెట్టనున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు..
హైదరాబాద్ నగర రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పేందుకు తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఏర్పాట్లు చేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నూతన అధ్యాయానికి త్వరలో శ్రీకారం చుట్టబోతుంది. హైదరాబాద్ నగర వీధుల్లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు దేశంలోనే తొలిసారి మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లు అందించిన అశోక్ లేలాండ్ అనుబంధ సంస్థ స్విచ్ మొబిలిటీతోపాటు మరో 2 కంపెనీలతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్చలు జరుపుతుందట.
చర్చలు కూడా దాదాపు చివరిదశలో ఉన్నట్టు, ధర విషయంలో స్పష్టత రాగానే ఆర్డర్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల టాక్. ఈ డీల్ ఓకే అయితే.. హైదరాబాద్ నగర వీధుల్లో 20–25 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. దేశంలోనే తొలిసారి ముంబాయిలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్లు రోడ్డెక్కాయి. ఈ నేపథ్యంలో ఈ చర్చ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది.
గతంలోనే హైదరాబాద్ నగర వీధులలో డబుల్ డెక్కర్ బస్సులను పునఃప్రారంభించాలని మంత్రి కేటీఆర్ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించిన విషయం తెలిసిందే.. ఈ మేరకు మంత్రి పువ్వాడ కూడా సానుకూలంగా స్పందించారు. గతేడాది డబుల్ డెక్కర్ బస్సులు కొనాలని నిర్ణయించి.. టెండర్లు కూడా పిలిచారు. కానీ.. నూతన బస్సులు కోలుగోలుకు సరిపడ నిధుల్లేకపోవడంతో ఈ నిర్ణయానికి అక్కడితోనే పుల్ స్టాప్ పడింది.
ఆర్టీసీకి డబుల్ డెక్కర్లు భారమేనా?
ముంబాయిలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు ఒక్కటి రూ.2 కోట్లు. ఇప్పటికే నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీ ఇంత భారీ మొత్తంతో బస్సులు కొనుగోలు చేయడం తలకుమించిన భారమేనట్టున్నారు నిపుణులు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సాయం చేసే అవకాశముందని తెలుస్తుంది. మరోవైపు డబుల్ డెక్కర్ బస్సు లో పనిచేయాలంటే.. రెండు షిఫ్టుల్లో కలిపి ఆరుగురు సిబ్బంది అవసరం. గతంలో డబుల్ డెక్కర్ బస్సులతో తీవ్ర నష్టాలు రావడం వల్లే వాటిని తప్పించారట.