ప్రయాణికులకు TSRTC బంపరాఫర్.. ఈ టికెట్లపై ప్రత్యేక రాయితీ..
ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ( TSRTC) శుభవార్త చెప్పింది. వేసవిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్థికభారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
![tsrtc bumper offer for passengers you can move around the city with rs90 KRJ tsrtc bumper offer for passengers you can move around the city with rs90 KRJ](https://static-ai.asianetnews.com/images/01g3dn94g4jqfzg1t2xwk3cr12/tsrtc-jpg_363x203xt.jpg)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రయాణికులకు ఓ తీపికబురు చెప్పింది. వేసవి కాలంలో ప్రయాణికులకు ఓ బంపరాఫర్ ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్, జంట నగరాల్లో పర్యటించాలనుకునే వారికి మరింత చేరువ అయ్యేందుకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను తీసుకవచ్చింది. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఇప్పటికే టి-24 టికెట్ను అందజేస్తోన్న ఆర్టీసీ సంస్థ.. ఆ టికెట్ పై 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోంది. అంటే.. సాధారణంగా టి-24 టికెట్ ధరను రూ.100 ఉండగా.. ఇప్పుడు రూ.90కే అందించనున్నది.
అంతేకాదు.. సీనియర్ సిటిజన్లకు మరింత రాయితీని కల్పించింది. వారికి రూ.80కే ఆ టికెట్ ను అందించనుంది. ఈ ఆఫర్ 60 ఏళ్ళు పైబడిన వారికి వర్తిస్తోంది. వారు టి-24 టికెట్ పై 20 శాతం రాయితీని పొందవచ్చు. ఈ ఆఫర్ పొందాలనుకునే వారు బస్ కండక్టర్లను, బస్ స్టాప్ ల్లోగానీ సంప్రదించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కొత్త టి-24 టికెట్ ధరలు గురువారం నుంచి అమల్లోకి రాగా, శుక్రవారం నుంచి బస్ కండక్టర్ల వద్ద అందుబాటులోకి రానున్నాయి.
ఆ టికెట్ను కొనుగోలు చేసిన వారు.. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. తొలుత ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించారు. ఆ తర్వాత టి-24ని 100కి తగ్గించింది. తాజాగా సమ్మర్ ఆఫర్ పేరుతో టి-24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. టీ-24 టికెట్కు మంచి స్పందన వస్తోందని, సగటున రోజుకు 25 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయని TSRTC అధికారులు తెలిపారు.
ఇటీవల మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 పేరిట టికెట్ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.50తో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సిటీలో ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అలాగే.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ను అందుబాటులోకి తీసుకవచ్చారు. రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ కోరారు. టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.