టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ కేసులో  ఐదుగురు నిందితులను  కస్టడీకి ఇవ్వాలని ఈడీ  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 


హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఈడీ శుక్రవారంనాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు హైద్రాబాద్ ఎంఎస్‌జే కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితుల తరపు న్యాయవాదులు ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయనున్నారు.

 టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో జైలులోనే ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ జనార్ధన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్ లను గత మాసంలో ఈడీ అధికారులు 10 గంటల పాటు విచారించారు. మరో వైపు టీఎస్‌పీఎస్‌సీ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మి, మరో ఉద్యోగి సత్యనారాయణను కూడా ఈడీ అధికారులు విచారించారు. తాజాగా రేణుక , రాజేశ్వర్, ఢాక్యానాయక్, గోపాల్, నీలేష్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. 

రేణుక నుండి పేపర్ కొనుగోలు చేసిన వ్యక్తులు ఆర్ధిక లావాదేవీల విషయంలో గొడవ పడి పేపర్ లీక్ అంశాన్ని బయట పెట్టారు. ఈ విషయమై డబ్బులు చేతులు మారిన విషయాలపై ఈడీ అధికారులు విచారణ నిర్వహించనున్నారు.

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్: మరో ముగ్గురు అరెస్ట్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయమై ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 12, 15,16 తేదీల్లో జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఓవర్సీస్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ నియామాకాల పరీక్షలను తొలుత వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్‌సీ కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయనే కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేశారు. అయితే మార్చి 5వ తేదీన జరిగిన ఏఈఈ పరీక్ష పేపర్ లీకైందని గుర్తించారు. దీంతో ఈ కేసు విచారణను సిట్ కు అప్పగించింది ప్రభుత్వం. ఈ కేసులో మొత్తం 24 మందిని సిట్ అరెస్ట్ చేసింది.