నిరుద్యోగ యువత ధైర్యం కోల్పోవద్దు.. కేసీఆర్పై హత్యనేరం కేసు పెట్టాలి: రేవంత్ రెడ్డి
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందకు సంబంధించి టీఎస్పీఎస్సీ ఇప్పటికే అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షను రద్దు చేయగా.. శుక్రవారం రోజున గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం నివేదికతో తమ అంతర్గత విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవీన్ అనే అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కోరారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు.
కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడని విమర్శించారు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1 కు ప్రిపేర్ అయిన సిరిసిల్లకు చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై ఉరికొయ్యకు వేలాడాడని చెప్పారు. కేసీఆర్పై హత్యనేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. నవీన్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అతడి కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని.. కాంగ్రెస్ అండగా ఉంటుందని.. పోరాటం చేద్దామని అన్నారు.