తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేసినవారిలో నీలేష్ నాయక్, కేతావత్ శ్రీనివాస్, రాజేందర్ నాయక్, షమీమ్, సురేశ్ మరో ముగ్గురు ఉన్నారు. రూ. 50 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సిట్ విచారణకు సహకరించాలని ఆదేశించింది. నిర్దేశించిన తేదీల్లో విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. ఇటీవలే నాంపల్లి కోర్టు ఈ కేసులో రేణుకాకు, మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఇక, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఐదుగురు నిందితులు రేణుక , రాజేశ్వర్, ఢాక్యానాయక్, గోపాల్, నీలేష్లను కస్టడీకి ఇవ్వాలని ఈడీ శుక్రవారంనాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు హైద్రాబాద్ ఎంఎస్జే కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితుల తరపు న్యాయవాదులు ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే గతంలో వీరి కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
