టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడంటే..?
TSPSC Group 1 prelims: ఆదివారం జరిగిన టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 75 శాతం మందే హాజరయ్యారు. మొత్తం 503 గ్రూప్ 1 పోస్టులకు 3,80,082 మంది దరఖాస్తు చేసుకోగా, 2,86,051 మంది పరీక్ష రాయడానికి వచ్చారు.
TSPSC Group 1 Prelims Results: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ఆదివారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. 33 జిల్లాల్లోని 1019 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ప్రిలిమ్స్కు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,86,051 మంది హాజరయ్యారు. అంటే దరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల్లో కేవలం 75 శాతం మంది మాత్రమే పరీక్షను రాశారు. అయితే, పరీక్ష రాసినవారు పేపర్ టఫ్ గా ఉందని తెలిపారు. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల స్థాయిలో పేపర్ ఇచ్చారనీ, డైరెక్టు ప్రశ్నలు సైతం తక్కువగా ఉన్నాయని చెప్పారు.
కాగా, టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ప్రిలిమ్స్ తర్వాత దశలో పరిశీలన, ధృవీకరణ ప్రయోజనాల కోసం.. ప్రిలిమ్స్కు హాజరైన అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను తీసుకుంది. ఇది ఫైనల్స్ రాసే అభ్యర్థుల జాబితాతో ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలుగా బోర్డు పేర్కొంది.
TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ కీ విడుదల..
TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ OMR జవాబు పత్రం కాపీలను స్కాన్ చేసిన తర్వాత విడుదల చేయబడుతుంది. మొత్తం ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేయడానికి దాదాపు ఎనిమిది నుంచి పనిదినాలు పడుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇది పూర్తయిన తర్వాత OMR స్కాన్ చేసిన కాపీలు TSPSC అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే తీసుకున్న తర్వాత తుది కీని విడుదల చేస్తారు. దీనిని నిపుణుల కమిటీ నిర్ణయిస్తుంది.
TSPSC గ్రూప్ I ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రెండు నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన వారు మెయిన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. దీనికి ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉద్యోగ నియామక బోర్డు అన్ని చర్యలు తీసుకుంటోంది. కాగా, గ్రూప్-1 సర్వీసులకు సైతం కొన్ని నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు, TSPSC రాత పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించేది. పరీక్ష, ఇంటర్వ్యూ రెండింటిలోనూ అభ్యర్థులు సాధించిన మార్కులను మెరిట్ జాబితాను సిద్ధం చేయడానికి పరిగణించారు. అయితే ఇప్పుడు రాతపరీక్షలో వచ్చిన మార్కులను మెరిట్ జాబితాను సిద్ధం చేసేందుకు వినియోగిస్తారు.
ప్రిలిమ్స్ పేపర్ మస్తు టఫ్.. !
టీఎస్ పీఎస్సీ ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం మస్తు టఫ్ గా వచ్చిందని పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు పేర్కొన్నారు. పేపర్ పూర్తి చేయడానికి సమయం కూడా సరిపోలేదని మరికొందమంది అభ్యర్థులు వెల్లడించారు. టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ యూపీఎస్సీ స్థాయిలో ఉందని మరికొంత మంది అభ్యర్థులు చెప్పారు. డైరెక్ట్ క్వశ్చన్లు 20 కంటే తక్కువగానే వచ్చాయని తెలిపారు. అనలైటికల్ క్వశ్చన్ ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
కటఫ్ మార్కులు వందలోపే...
టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు 100 లోపే వుండే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం మస్తు టఫ్ గా ఇచ్చారని పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొంటున్నారు. పలు కోచింగ్ ఇనిస్టిట్యూట్ లు సైతం ఇదే విషయాన్ని పేర్కొన్నాయి. మొత్తం 150 మార్కుల పేపర్ లో 80-90 మధ్య కటాఫ్ మార్కులు ఉంటాయని పలువురు పేర్కొనగా, 75-80 మార్కులు ఉండవచ్చునని మరికొందమంది అంచనా వేశారు. కాగా, ఇప్పటికే పలు కోచింగ్ సెంటర్లు టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కీ ని విడుదల చేశాయి.