చమురు ధరల తగ్గింపుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. చమురు ధరల తగ్గింపు కోసం రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. తాము 2014 నుంచి ఇప్పటి వరకు వ్యాట్ పెంచలేదని పేర్కొన్నారు. అంతేకాదు, కేంద్రం సెస్ ఎత్తేస్తే రూ. 70కే లీటర్ పెట్రోల్, రూ. 60కే డీజిల్ అమ్ముతామని వెల్లడించారు. 

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులను సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ముఖ్యమంత్రులతో వర్చువల్ కాన్ఫరెన్స్‌లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం చివరిలో చమురు ధరల పెంపుపై బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసి ప్రధాని మాట్లాడారు. తాను విమర్శించడం లేదని, కేవలం అప్పీల్ చేస్తున్నానని, వ్యాట్ పెంచకుండా ప్రజల సంక్షేమం కోసం తక్కువ ధరలకే చమురు అందించాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఆయన తన ట్వీట్లను కేంద్ర ప్రభుత్వాన్ని నాన్ పర్ఫార్మింగ్ అస్సెట్‌ (ఎన్‌పీఏ/ నిరర్ధక ఆస్తి)గా విమర్శిస్తూ మొదలు పెట్టారు. అసలు తాము వ్యాట్ పెంచనేలేదని, కానీ, పేరు పెట్టి మరీ ఈ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడే సహకార సమాఖ్యస్ఫూర్తి అంటే ఇదేనా? అంటూ ప్రధానిని ప్రశ్నించారు. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం చమురుపై వ్యాట్ పెంచలేదని స్పష్టం చేశారు. కేవలం ఒకే సారి రౌండ్ ఆఫ్ చేశారని వివరించారు.

Scroll to load tweet…

మరో ట్వీట్‌లో వన్ నేషన్ వన్ ప్రైస్? (ఒక దేశం - ఒకే ధర)ను అమలు చేయవచ్చు కదా? అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. చమురుపై హక్కుగా లభించే 41 శాతం వాటా తమకు లభించడం లేదని, కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్ వల్లే ఈ నష్టం తమకు వాటిల్లుతున్నదని పేర్కొన్నారు. సెస్ రూపంలో రాష్ట్రాల నుంచి కేంద్రం 11.4 శాతం వాటా కొట్టేస్తున్నదని, 2023 ఆర్థిక సంవత్సరంలో తమకు కేవలం 29.6 శాతం మాత్రమే దక్కుతున్నదని వివరించారు. దయచేసి సెస్‌ను ఎత్తేయండని కోరారు. తద్వార దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్‌ను రూ. 70కి, డీజిల్‌ను రూ. 60కి తాము అందించగలుగుతామని పేర్కొన్నారు. వన్ నేషన్ - వన్ ప్రైస్ సాధ్యం అవుతుంది కదా? అన్నట్టుగా ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంధన ధరలను ప్రస్తావిస్తూ.. వ్యాట్‌ను తగ్గించిన రాష్ట్రాల్లో ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయని ప్రధాని మోడీ ఈ రోజు సీఎంలతో సమావేశంలో సూచించారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కేంద్రం అభ్యర్థించిందని చెప్పారు. ‘‘నేను ఎవరినీ విమర్శించడం లేదు.. కేవలం చర్చిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి చెప్పారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనాలు అందించాలని అభ్యర్థిస్తున్నట్టుగా చెప్పారు.