కొత్త జిల్లాల పేర్లు మార్పు
కొత్త జిల్లాలపై రోజుకో కొత్త మార్పు చోటుచోసుకుంటుంది. అయితే వీటన్నింటికీ ఇప్పుడు ఫుల్స్టాప్ పెడుతూ కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల్లో 5 జిల్లాల పేర్లను మార్చారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడే పేర్లపై కూడా అక్కడక్కడ విమర్శలొచ్చాయి. మఖ్యమైన కేంద్రంలో పరిపాలన విభాగం ఉంటే పేరు మాత్రం వేరే పెట్టారని కొన్ని చోట్ల ఆందోళనలు కూడా చోటు చేసుకున్నాయి.
ముఖ్యంగా భువనగిరి, సిరిసిల్ల, గద్వాల తదితర పట్టణాలలో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసినా పేరులో మాత్రం ఆ పట్టణాల పేర్లు లేకుండా చేశారు.
దీన్ని సరిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేశారు. మొదటి ఆరు జిల్లాల పేర్లను మారుస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఐదు జిల్లాల పేర్లను మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెంగా, గద్వాల జిల్లాను జోగులాంబ గద్వాలగా, యాదాద్రి జిల్లాను యాదాద్రి భువనగిరిగా, కొమురం భీం జిల్లా పేరును కుమురం భీం జిల్లాగా, రాజన్న జిల్లా పేరును రాజన్న సిరిసిల్ల జిల్లాగా మార్చారు.
ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. కేటీ దొడ్డి మండలంలోకి ఏపీ కొండనహల్లి గ్రామం, గట్టు మండలంలోకి ముస్లీంపల్లె గ్రామం, ఉండవల్లి మండలంలోకి శాలిపూర్, ఖానాపూర్ గ్రామాలు, మనోపాడ్ మండలంలోకి మంగపేట, రాయిమాకులకుంట్ల, పొసలపాడు గ్రామాలు చేర్చారు.
