ఎంపీ అరవింద్పై చర్యలు తీసుకోండి, మళ్లీ తప్పుగా మాట్లాడితే ఊరుకోం: మహిళా కమిషన్కు టీఆర్ఎస్ మహిళానేతల ఫిర్యాదు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై టీఆర్ఎస్ మహిళా విభాగం నేతలు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ అసభ్యంగా మాట్లాడారని, ఆయనపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేశారని, ఆయన పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికార పార్టీకి చెందిన మహిళా నేతలు కొందరు తాజాగా మహిళా కమిషన్కు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇలా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం తాము సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ లక్ష్మారెడ్డి, పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు.
మహిళల పట్ల అసభ్యంగా, అభ్యంతరకరంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన తన మాటల్లో అభ్యంతరకర పదాలు ఉపయోగించారని టీఆర్ఎస్ మహిళా నాయకులు ముక్తవవరం సుశీలా రెడ్డి ఆ ఫిర్యాదులో తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: మాజీ నక్సలైట్లతో విపక్ష నేతలపై దాడులకు టీఆర్ఎస్ కుట్ర : ఈటల సంచలన వ్యాఖ్యలు
సిటీ సివిల్ కోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను సైతం ధిక్కరించి మహిళలను అవమానించే విధంగా మాట్లాడారని తెలిపారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి అసభ్యంగా, అభ్యంతరకరంగా, అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. గతంలోనూ ఎంపీ అరవింద్ పిచ్చిపిచ్చిగా మాట్లాడారని వివరించారు. అంతేకాదు, భవిష్యత్లో తప్పుడుగా మాట్లాడితే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోమని పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా యాక్షణ్ తీసుకోవాలని పోలీసులు, మహిళా కమిషన్ను వారు కోరారు. సుశీలారెడ్డితోపాటు మహిళా నాయకురాళ్లు లీలా, సువర్ణా రెడ్డి, గీతా గౌడ్, ఉమావతి, ప్రభారెడ్డి, సుజాతా గౌడ్, ప్రీతి రెడ్డి, పద్మ తదితరులు ఫిర్యాదు చేశారు.