Huzuarabad By Poll: ప్రచారంపై అధికార పార్టీ ఫోకస్... టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే
తొలి నుంచి హుజురాబాద్లో దూకుడుగా వుంటున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ను అధిష్ఠానం ఖరారు చేసింది. మొత్తం 20 మంది నేతల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి సమర్పించింది.
హుజూరాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని రాజకీయ పార్టీలు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో తొలి నుంచి హుజురాబాద్లో దూకుడుగా వుంటున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి రంగం సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ను అధిష్ఠానం ఖరారు చేసింది. మొత్తం 20 మంది నేతల పేర్లను కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి సమర్పించింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇతర టీఆర్ఎస్ నేతలు స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో ఉన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుండి ఈనెల 8వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళ్లేందుకు ఐదుగురికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక అభ్యర్థులు నామినేషన్ వేసిన నుండి వారి ఎన్నికల ఖర్చు లెక్కించనున్నారు అధికారులు. ప్రతి అభ్యర్థి ఈ ఎన్నికల్లో 28 లక్షల వరకూ ఖర్చు చేయవచ్చని ఈసీ చెప్పింది. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలి.