వరి ధాన్యం కొనుగోలుకై: పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీల ధర్నా
వరి ధాన్యం కొనుగోలు చేస్తారా లేదో చెప్పాలని కోరుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ప్ల కార్డులు చేతబూని టీఆర్ఎస్ ఎంపీలు నిరసనకు దిగారు.
న్యూఢిల్లీ: రాష్ట్ర రైతాంగం పండించిన వరి ధాన్యం కొంటారా లేదా అంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ టీఆరెస్ ఎంపీలు బుధవారం నాడు నిరసనకు దిగారు. రాజ్యసభ,లోక్ సభలో బైఠాయించి నిరసన తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. Telangana రాష్ట్రంలో Paddy ధాన్యం కొనుగోలుపై Trs ఎంపీలు ఆందోళనలు సాగిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి టీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లోనూ తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. రైతులకు న్యాయం చేయాలంటూ పార్లమెంట్ లోపల ,బయట ప్లకార్డుల తో ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని టీఆర్ఎస్ ఎంపీలు తేల్చి చెప్పారు.
కేంద్రంపై టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు విమర్శలు
రైతుల విషయంలో కేంద్రం రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు చెప్పారు. గత 60 రోజులుగా సమావేశాలు నిర్వహించినా కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ సాక్షిగా మంత్రితో ప్రకటన చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఉద్యమంలో చనిపోయిన రైతుల లెక్కలు లేవని తప్పించుకొనేందుకు ప్రభుత్వం ప్రకటించడం బాధాకరమన్నారు. తెలంగాణ రైతాంగాన్ని కూడా కించపర్చేలా కేంద్ర మంత్రి మాట్లాడడాన్ని కేకే తప్పుబట్టారు.