బ్యాంకుల నిధుల మళ్లింపు: ఈడీ విచారణకు నామా డుమ్మా, హాజరైన డైరెక్టర్లు
బ్యాంకుల నుండి తీసుకొన్న రుణాలను దారిమళ్లించారనే కేసులో మధుకాన్ కంపెనీకి చెందిన డైరెక్టర్లు ఈడీ అధికారుల ముందు శుక్రవారం నాడు విచారణకు హాజరయ్యారు. అయితే ఇవాళ విచారణకు ఖమ్మం ఎంపీ మాత్రం హాజరుకాలేదు.
హైదరాబాద్: బ్యాంకుల నుండి తీసుకొన్న రుణాలను దారిమళ్లించారనే కేసులో మధుకాన్ కంపెనీకి చెందిన డైరెక్టర్లు ఈడీ అధికారుల ముందు శుక్రవారం నాడు విచారణకు హాజరయ్యారు. అయితే ఇవాళ విచారణకు ఖమ్మం ఎంపీ మాత్రం హాజరుకాలేదు.రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కోసం మధుకాన్ కంపెనీ బ్యాంకుల నుండి సుమారు రూ. 1064 కోట్లను రుణం తీసుకొంది. ఇందులో సుమారు రూ. 264 కోట్లు దారి మళ్లాయని సీబీఐ గుర్తించింది.ఈ మేరకు 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మధుకాన్ కంపెనీతో కార్యాలయాలతో పాటు రాంచీ ఎక్స్ప్రెస్ హైవే సీఎండీ కార్యాలయం, డైరెక్టర్ల నివాసాల్లో ఈ నెల 11వ తేదీన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
also read:నేను ఎవరినీ మోసం చేయలేదు, ఇకపైనా చేయను.. ఈడీ విచారణకు సహకరిస్తా: నామా వ్యాఖ్యలు
ఈ సోదాలు నిర్వహించిన తర్వాత విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. టీఆర్ఎస్ కు చెందిన ఎంపీ నామా నాగేశ్వరరావు సహా కంపెనీ డైరెక్టర్లు, సీతయ్య, పృథ్వీరాజ్, రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే సీఎండీ శ్రీనివాసరావులకు ఈడీ నోటీసులు పంపింది.సీతయ్య, పృథ్వీరాజ్, శ్రీనివాసరావులు ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణకు నామా నాగేశ్వరరావు మాత్రం హాజరు కాలేదు. అనారోగ్యంగా ఉన్నందున విచారణకు హాజరుకాలేదని నామా నాగేశ్వరరావు ఈడీ అధికారులకు సమాచారం పంపారని తెలిసింది. నామా నాగేశ్వరరావు తరపున ఆయన న్యాయవాది ఈ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది.