మధుకాన్తో సంబంధం లేదు... 2009లోనే రాజీనామా చేశా: ఈడీ కేసుపై హైకోర్టుకెక్కిన నామా నాగేశ్వరరావు
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఆస్తుల అటాచ్ ఉత్తర్వులను తక్షణం కొట్టేయాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు.
తనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు శుక్రవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల అటాచ్ ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన తన పిటిషన్లో కోరారు. రాంచీ ఎక్స్ప్రెస్ హైవే కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని నామా పేర్కొన్నారు. 2009లోనే మధుకాన్ గ్రూప్ కంపెనీలకు తాను రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. సీబీఐ ఎఫ్ఐఆర్, ఛార్జ్షీట్లోనూ తన పేరు లేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఈడీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసినట్లు తెలిపింది.
కాగా.. గత నెలలో ఎంపీ నామా నాగేశ్వరరావు కు చెందిన కంపెనీలకు చెందిన రూ.80.65 కోట్లను జప్తు చేసినట్టుగా ఈడీ ప్రకటించింది.మధుకాన్ సంస్థకు నామా నాగేశ్వరరావు ప్రమోటర్ గా ఉన్నారు. ఈ ఏడాది జూలై 2న కూడా మధుకాన్ గ్రూప్ సంస్థలకు చెందిన రూ.96కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి నామా నాగేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు మధుకాన్ సంస్థలకు చెందిన కార్యాలయాలు ఈ సంస్థతో సంబంధం ఉన్న నామా నాగేశ్వరరావు కుటుంబసభ్యుల ఇళ్లలో గత ఏడాది జూన్ మాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ALso REad:ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకి ఈడీ షాక్: మధుకాన్ సంస్థల రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు
2021 జూన్ 25న రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే నిధుల మళ్లింపు కేసులో ఈడీ అధికారుల విచారణకు మధుకాన్ సంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు.అయితే ఈ సమావేశానికి నామా నాగేశ్వరరావు హాజరు కాలేదు.రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కోసం మధుకాన్ కంపెనీ బ్యాంకుల నుండి సుమారు రూ. 1064 కోట్లను రుణం తీసుకొంది. ఇందులో సుమారు రూ. 264 కోట్లు దారి మళ్లాయని సీబీఐ గుర్తించింది.ఈ మేరకు 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మధుకాన్ కంపెనీతో కార్యాలయాలతో పాటు రాంచీ ఎక్స్ప్రెస్ హైవే సీఎండీ కార్యాలయం, డైరెక్టర్ల నివాసాల్లో 2011 జూన్ 11వ తేదీన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.