ఆరేళ్లలో లక్షా 32వేల ఉద్యోగాలిచ్చాం: ఎంపీ కేశవరావు
విద్యారంగంలో కేంద్రం దేశ ప్రజలకు- తెలంగాణకు చేసింది ఏమీలేదని టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు అన్నారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినతర్వాత అంటే గత ఆరు సంవత్సరాలలో 1లక్ష 32వేల ఉద్యోగాలు భర్తీ చేశామని టీఆర్ఎస్ రాజ్యసభ్య సభ్యులు కే.కేశవరావు పేర్కొన్నారు. ఇలా సొంత రాష్ట్రం తెలంగాణ కోసం తామెంతో చేశామన్నారు.
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానానికి సంబంధించిన ముఖ్య నేతలతో మంత్రి బేటీ అయ్యారు. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
read more ఎమ్మెల్సీ ఎన్నికలు: జిల్లాకు ముగ్గురు మంత్రులు.. ఎమ్మెల్యేలదే బాధ్యత, కేటీఆర్ ఆదేశాలు
ఈ సందర్బంగా ఎంపీ కేశవరావు మాట్లాడుతూ...'' విద్యారంగంలో కేంద్రం దేశ ప్రజలకు- తెలంగాణకు చేసింది ఏమీలేదు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలు ప్రజలు మర్చిపోలేదు. పీవీ సుగుణాలన్నీ ఆయన కూతురు వాణిలో ఉన్నాయి. ఆమె కూడా విద్యారంగంలో అనేక సేవలు వాణిదేవి చేస్తున్నారు. ఆమె ఎలాంటి కాంట్రవర్సీ లేని వ్యక్తి.'' అని అన్నారు.
''గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలాలతోనే ప్రచారంలోకి వెళ్తున్నాము. ప్రతిపక్షాల లాగా అనవసర విమర్శలు మేము చేయము. రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ కైవసంచేసుకోవడం ఖాయం'' అన్నారు కేశవరావు.