రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో వున్న ప్రఖ్యాత ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాకు కవిత చాదర్‌ను సమర్పించారు .

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం నాడు ఖ్వాజా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మొహియుద్దీన్‌ చిస్తీ దర్గాకు కవిత చాదర్‌ను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు కవిత మీడియాకు తెలిపారు. అనంతరం దర్గా పెద్దలను కల్వకుంట్ల కవిత కలుసుకున్నారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. సీఎం కెసిఆర్ నాయకత్వంలో లౌకికత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని కవిత అన్నారు. 

దర్గాను దర్శించుకున్న అనంతరం రాజస్థాన్‌లోని పుష్కర్ దేవాలయాన్ని, శ్రీనాథ్‌జీ దేవాలయాన్ని కూడా కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఆమె వెంట టీఆర్ఎస్ పార్టీ నేతలు ఆజం అలి , బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, బొరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దిన్ , టీఆర్ఎస్ నాయకులు కుద్దూస్, నవీద్ ఇక్బాల్, అలీం తదితరులు వున్నారు.