కలెక్టర్ ప్రీతీ మీనా చేయి పట్టుకున్న ఎమ్మెల్యే
- మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతీ మీనా చేయి పట్టుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్
- కలెక్టర్ ఆగ్రహం, సిఎస్ కు ఫిర్యాదు
- స్పందించిన సిఎం కెసిఆర్, ఎమ్మెల్యేపై ఆగ్రహం
- తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేకు సిఎం హెచ్చరిక
రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో హరితహారం జరుగుతంటే మహబూబాబాద్ లో మాత్రం కొత్త వివాదం నెలకొల్పింది. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా పట్ల స్థానిక ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించారని కలెక్టర్ ఆరోపించారు. ఈ సంఘటన పెద్ద దుమారం రేపింది.
మహూబూబాబాద్ కలెక్టర్ ప్రీతీమీనాతోపాటు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేయిని అసభ్యకరంగా పట్టుకున్నట్లు శంకర్ నాయక్ మీద ఆమె ఆరోపణలు చేశారు. దీంతో తీవ్ర మనోవేధన చెందిన కలెక్టర్ శంకర్ నాయక్ తీరు పట్ల సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే తీరు సరిగా లేదని అతడిని హరితహారం కార్యక్రమం వద్దే గొడవకు దిగారు. ఎమ్మెల్యే కూడా తగ్గకుండా ఆమెతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.
కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనకు నిరసనగా కలెక్టరేట్ సిబ్బంది ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే తీరును ఎండగట్టారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు కలెక్టర్ తనకు జరిగిన అవమానంపై సిఎస్ ఎస్పీ సింగ్ కు ఫిర్యాదు చేశారు. అలాగే ఐఎఎస్ ల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. ఇక కలెక్టర్ కు జరిగిన అవమానంపై ఐఎఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు సీరియస్ అయ్యారు. రేపు సిఎం కెసిఆర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఇక ఈ సంఘటనపై సిఎం కెసిఆర్ స్పందించారు. ఎమ్మెల్యే పై సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని శంకర్ నాయక్ కు సూచించారు. శంకర్ నాయక్ తన ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని సిఎం హెచ్చరించారు.
శంకర్ నాయక్ తీరు పట్ల గతంలోనూ సిఎం గుర్రుగా ఉన్నారు. శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా స్థానికంగా అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. భూకబ్జాలకు కేరాఫ్ అడ్రస్ గా శంకర్ నాయక్ పేరు మారుమోగిపోయింది. ఆయనను ఇప్పటికే పలుమార్లు సిఎం హెచ్చరించారు. తాజా సంఘటనతో శంకర్ నాయక్ మరోసారి బోనులో నిలబడాల్సి వచ్చింది.