టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు తగిలి ఓ వ్యక్తి మృతి
- దేవరకద్ర ఎమ్మెల్యే కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి
- మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన
మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలోని భూత్పూర్ మండలం లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి మంత్రి జూపల్లి కారులో నియోజకవర్గ పర్యటన చేపట్టాడు. అందులో భాగంగా తన నియోజకవర్గంలోని కొత్తకోటకు బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలో కారులో డీజిల్ వేయించుకోడానికి పెట్రోల్ బంకుకు వెళుతుండగా పోతులమడుగు గ్రామం వద్ద ఎమ్మెల్యే కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి పేరు వెంకటయ్యగా (59), అతడు పోతులమడుగు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాద విషయం తెలిసి వెంకటయ్య కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తమకు ఎమ్మెల్యే, ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. వెంకటయ్య మృతితో అతని కుటుంబంతో పాటు గ్రామంలోను విషాద ఛాయలు అలుముకున్నాయి.