హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించే అవకాశం ఉంది. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ బుధవారం నాడు సమావేశం కానున్నారు.

హైదరాబాద్: హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెల్లు శ్రీనివాస్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. ఈ విషయాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఇవాళ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ అసెంబ్లీ స్థానం నుండి బీసీ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపితే ఈటల రాజేందర్ ను ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉందని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నియోజకవర్గంలో 2.10 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో బీసీ సామాజికవర్గం ఓటర్లు గణనీయంగా ఉంటారు. ఆ తర్వాత దళిత సామాజికవర్గం ఓటర్లున్నారు. దీంతో టీఆర్ఎస్‌వీ అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది.

2009 నుండి ఈ అసెంబ్లీ స్థానం నుండి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా వరుసగా విజయాలు సాధించాడు.ఈ దఫా ఆయన బీజేపీ నుండి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఈ స్థానం నుండి తొలిసారి ఎన్నికను ఎదుర్కొంటున్నారు. ఈటల రాజేందర్ ను ధీటుగా ఎదుర్కొనేందుకుగాను టీఆర్ఎస్ నాయకత్వం పలువురి పేర్లను పరిశీలించింది. శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపిందని సమాచారం.

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడ నోముల నర్సింహయ్య తనయుడు భగత్ ను బరిలోకి దింపి టీఆర్ఎస్ విజయం సాధించింది. హుజూరాబాద్ లో కూడ శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది.ఇవాళ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు.ఈ భేటీలో నియోజకవర్గంలో పరిస్థితులతో పాటు అభ్యర్ధి ఎంపికపై చర్చించనున్నారు. అభ్యర్ధి పేరును ఈ సమావేశంలో పార్టీ నేతలకు చెప్పే అవకాశం ఉంది.