గోవాలో టీఆర్ఎస్ లీడర్ల అరెస్టు
- గోవా జైల్లో టీఆర్ఎస్ నాయకులు
- న్యూ ఇయర్ వేడుకల్లో గొడవ
- ఎనిమిది రోజులుగా జైల్లోనే
నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు గోవాకు వెళ్లిన టీఆర్ఎస్ నాయకులు కొందరు కటకటాలపాలయ్యారు. వీరిని అరెస్ట్ చేసిన గోవా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలా సరదాగా గడపడానికి వెళ్లిన వారు గత ఎనిమిది రోజులుగా జైల్లోనే మగ్గుతున్నారు. వారిని విడిపించడానికి బడా టీఆర్ఎస్ నాయకులెవరు పట్టించుకోకపోవడంతో ఈ ఛోటా లీడర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది.
ఈ సంఘటనకు సంభంధించిన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్ దేవానందం తో కలిసి 16 మంది టీఆర్ఎస్ నేతలు గత నెల 29న టూర్కు బయలుదేరారు. ఇలా వివిధ ప్రదేశాలను సందర్శించి 31 డిసెంబర్ నాటికి గోవాకు చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్లో బస చేశారు. అయితే ఆ రాత్రి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న వీరంతా పూటుగా మద్యం సేవించారు. ఈ మత్తులో హోటల్ వద్ద వాహనం పార్క్ చేసే విషయంలో స్థానికులతో గొడవ పడ్డారు. ఈ గొడవలో కొందరు స్థానికులకు గాయాలయ్యాయి.
దీంతో స్థానికేతరులు కొందరు తమపై దాడి చేశారంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దయానంద్ తో పాటు కె.దర్శన్, ఎ.శ్రీనివాస్, ప్రశాంత్రెడ్డి, సయ్యద్ ఉస్మాన్, సయ్యద్ బదీరుద్దీన్, పురుషోత్తం రెడ్డి, నర్సింహారెడ్డి, ఎస్.అజరు, డి.శ్రీనివాస్, సి.కృష్ణ, ఎం.కిరణ్, బి.ఆంజనేయులు, గోపాల్, దేవానంద్ అంజయ్య, బాలయ్యతో పాటు మొత్తం 16 మందిని అరెస్టు చేశారు. వీరిపై సెక్షన్ 143, 147, 148, 149, 323, 307 కింద కేసులు నమోదు చేశారు. అలాగే వీరు తీసుకెళ్లిన వస్తువులతో పాటె వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరిని విడిపించెందుకు కుటుంబసభ్యులు, జిల్లా నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.