రేవంత్ కు కోస్గి దెబ్బ
- కోస్గి వార్ కు సై అంటున్న సర్కార్
- రేవంత్ తొలి సభ వద్దే మంత్రి జూపల్లి పర్యటన
- ఆసక్తి రేపుతున్న కొడంగల్ రాజకీయం
రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలి సభను కోస్గి పట్టణంలో జరిపారు. వేలాది మందితో ర్యాలీ తీసి భారీ సభ జరిపారు. ఈ సభకు గతంలో తన ప్రత్యర్థిగా ఉన్న డికె అరుణను ఈ సమావేశానికి పిలిపించారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేడర్ లో జోష్ పెంచే ప్రయత్నం చేశారు. ఇద్దరినీ ఒకే వేదిక మీద చూడడం పట్ల కేడర్ కుషీ అయ్యారు. కోస్గిలో భారీ ర్యాలీ తీసి హల్ చల్ చేశారు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు సర్కారు వంతు వచ్చింది. కాంగ్రెస్ రేవంత్ తొలి సభ జరిపిన అదే కోస్గిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. సోమవారం ఆయన కోస్గి లో పర్యటించనున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు మంత్రి జూపల్లి. రేవంత్ రెడ్డి కోస్గి సవాల్ కు ప్రభుత్వం కూడా కోస్గిలోనే సమాధానం చెప్పేందుకు రెడీ అయినట్లు ప్రభుత్వ తీరు చూస్తే తెలిసిపోతున్నది.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమంటే..? జూప్లలికి బద్ధ శత్రువుల జాబితాలో డికె అరుణ ఉంటారు. వీరిద్దరూ పాము ముంగీస రీతిలో వైరం నడుపుతున్నారు. ఇద్దరూ కాంగ్రెస్ లో మంత్రులుగా ఉండి కూడా బస్తీ మే సవాల్ అని ఫైట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు శత్రువుల సవాల్ కు జవాబు చెప్పేందుకే మంత్రి జూపల్లి కోస్గిలో పర్యటిస్తున్నారన్న వాతావరణం నెలకొంది.
కొడంగల్ నియోజకవర్గం కోస్గీ మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 27న పర్యటన ఇలా సాగనుంది. గతంలో కోస్గీ పర్యటన సందర్భంగా ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన విజ్ఞాపనలతో పలు అభివృద్ధి పనులకు అప్పుడే ఆమోదం కూడా తెలిపారు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు కోస్గీలోని నాగసానిపల్లి రోడ్లో బీటీ రోడ్కు మంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం మండలంలోని ముదిరెడ్డి పల్లి లో బ్రిడ్జికి, భక్తిమల్లలో బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే భక్తిమల్లలో అదనపు తరగతి గదులతో పాటు..కోస్గీలో మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అధికారులతోనూ, మహిళా సంఘాల ప్రతినిధులతోనూ మంత్రి సమావేశం అవుతారు.
రేవంత్ ఇలాకాలో పాలమూరు మంత్రి జూపల్లి పర్యటన ఉత్కంఠ రేపుతున్నది. జూపల్లి పర్యటన తర్వాత కొడంగల్ ఫైట్ కొత్త మలుపు తిరిగే చాన్స్ ఉంటుందా అన్న చర్చ పాలమూరు రాజకీయాల్లో ఊపందుకుంది.