సారాంశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం నెలకొంది. ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ డ్యూటీ పూర్తి చేసుకుని తిరిగి వెళ్తుండగా నాలాలో పడి మృతి చెందింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం నెలకొంది . మంత్రి పర్యటనలో భాగంగా బందోబస్త్ కు వచ్చిన ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ ప్రమాదశాత్తు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి తూముల వద్ద కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది.
వివరాల్లోకెళ్తే.. శ్రీదేవి అనే మహిళా హెడ్ కానిస్టేబుల్ కొత్తగూడెంలో విధులు నిర్వహిస్తోంది. కేటీఆర్ పర్యటన సందర్బంగా బందోబస్త్ లో ఆమె డ్యూటీ చేసేందుకు భద్రాచలం వచ్చారు. విధులు ముగిసిన అనంతరం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం మహిళా హెడ్ కానిస్టేబుల్ వాహన పార్కింగ్ ప్రాంతం నుంచి అన్నదాన సత్రం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా కాలువలో జారిపడింది. సమాచారం అందుకున్న ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రంగం లో దిగింది.
కాలువలోకి దిగి వెతకగా తూముల వద్ద కానిస్టేబుల్ మృతదేహం లభ్యమైంది. మహిళ కానిస్టేబుల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలంలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు.
శ్రీదేవి మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబీకులు, బంధువులు కన్నీరుముని అవుతున్నారు. అలాగే ఆమె మృతి పట్ల తోటి ఉద్యోగులు ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రీదేవి కుటుంబ విషయానికి వస్తే.. ఆమె భర్త రామారావు.. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నారు. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్గా సేవలందిస్తున్నారు. వీరికి ఓ పాప ఉంది. భార్య మరణం భర్త రామారావుకు తీరని విషాదాన్ని మిగిల్చింది.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
ఖమ్మంలో శనివారం జరిగిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లాకారం ట్యాంక్బండ్పై రూ.1.37 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించగా.. దీనిని ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని అన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ సత్తాను దేశానికి తెలియజేసేలా చేశారని వ్యాఖ్యానించారు. తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్యదైవమని, తెలుగు ప్రజల మనస్సుల్లో చెరగమని ముద్ర వేశారని ప్రశంసించారు.