20 రోజుల పాటు తెలంగాణ అవతరణ వేడుకలు.. సోనియాకు పాలాభిషేకం : టీ.కాంగ్రెస్ పీఏసీ నిర్ణయాలివే
తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా 20 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలపై 20 రోజుల పాటు పోరాటం చేయనున్నారు నేతలు.
తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా భేటీలో తీసుకున్న వివరాలను మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వీ హనుమంతరావు మీడియాకు తెలిపారు. 20 రోజుల పాటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 20 రోజులు కార్యకర్తలు తమ ఇళ్లపై కాంగ్రెస్ జెండాను వుంచాలన్నారు. అలాగే మండల కేంద్రాల్లో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
త్వరలోనే బీసీ గర్జన కార్యక్రమం నిర్వహిస్తామని.. దీనికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఆహ్వానిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ వైఫల్యాలపై 20 రోజుల పాటు పోరాటం నిర్వహిస్తామన్నారు. ఫెయిల్యూర్ కేసీఆర్ స్లోగన్తో తాము పోరాటం చేస్తామని చెప్పారు. సీనియర్ నేత వీహెచ్ నాయకత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం పున: స్థాపన కోసం ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భారత పార్లమెంట్ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగమని ఆయన గుర్తుచేశారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ఆహ్వానించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మోడీ పార్లమెంట్కు హాజరుకారని.. దేశ చరిత్రలో అతి తక్కువ రోజులు సభకు హాజరైన ప్రధానిగా ఆయన రికార్డుల్లోకెక్కారంటూ చురకలంటించారు. తాము అడిగిన ప్రశ్నలకు ఏనాడూ మోడీ సమాధానం చెప్పలేదని.. కీలక చట్టాలను కూడా పది నిమిషాల్లోనే ఆమోదించుకుంటారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి తాము హాజరుకావడం లేదని ఆయన స్పష్టం చేశారు.