మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్హౌస్ కేసుకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. హైకోర్టులో కేటీఆర్ ఫాంహౌస్ తనది కాదన్న వాదనకు అనుకూలమైన తీర్పు వచ్చిందని.. నిజం ప్రజా కోర్టు తేల్చాలని ఆయన కోరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) , మంత్రి కేటీఆర్పై (ktr) టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. ''జన్వాడ ఫామ్హౌస్ (ktr farm house case) డ్రోన్ కేసులో నన్ను జైల్లో పెట్టారు. పోలీసులు అక్కడ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నివాసం ఉంటున్నారని ఆయన ప్రాణాలకు హాని తలపెట్టానని కోర్టుకు నివేదించారు. హైకోర్టులో కేటీఆర్ ఫాంహౌస్ తనది కాదన్న వాదనకు అనుకూలమైన తీర్పు వచ్చింది. నిజం ప్రజా కోర్టు తేల్చాలి'' అని రేవంత్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్తను రేవంత్ జత చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్సాగర్ల క్యాచ్మెంట్ ఏరియాల్లో జీవో 111 రూల్స్ను ఉల్లంఘించి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టారంటూ రేవంత్రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్లో దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని హైకోర్టు తేల్చిందని అందులో పేర్కొన్నారు. రేవంత్రెడ్డి పిటిషన్ను, ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కేటీఆర్, ఫామ్హౌస్ యజమాని ప్రదీప్రెడ్డి విడివిడిగా వేసిన రిట్లను అనుమతిస్తూ జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, జస్టిస్ పి.నవీన్రావ్ల డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిందని రేవంత్ వివరించారు.
