ప్రధాని నరేంద్ర మోడీ కోసమే బీఆర్ఎస్ను కేసీఆర్ పెట్టారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఏం చేసింది..బీజేపీ ఏం చేసింది..కేసీఆర్ ఏం చేశారో తేల్చుకుందామంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుకున్నారని దుయ్యబట్టారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పార్టీకి ఏ పేరైనా మార్చుకోవచ్చన్నారు. కేసీఆర్ ఉపన్యాసాలు చూస్తుంటే మోదీ తో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కు మోదీని ఓడించాలని ఉంటే గుజరాత్ లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. యూపీలో అఖిలేష్ను గెలిపించేందుకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని రేవంత్ నిలదీశారు. ఢిల్లీలో తన వ్యాపార భాగస్వామి కేజ్రీవాల్ పార్టీని గెలుపు కోసం ఎందుకు మద్దతు ఇవ్వలేదన్నారు. డి.రాజా, కేరళ సీఎం, ఢిల్లీ సీఎం, పంజాబ్ సీఎం, అఖిలేష్ యాదవ్లు ఒక ఒక బృహత్ ప్రణాళికతో ముందుకు వస్తారని చివరి వరకు గమనించానని రేవంత్ అన్నారు.
కానీ కాంగ్రెస్, బీజేపీలను కలిపి విమర్శించే ప్రయత్నం చేశారని.. దేశంలో రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టులు కట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు. 245టీఎంసీల సామర్ధ్యంతో నాగార్జున సాగర్ను నిర్మించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. 1 లక్షా 45 ల గ్రామాలకు కరెంట్ ఇచ్చామని, 1 లక్ష గ్రామాలకు తాగునీరు అందించిన ఘనత కాంగ్రెస్దేనని పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం, బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఇచ్చింది కాంగ్రెస్సేనని.. ఎల్ఐసీ, ఎయిర్ ఇండియా లను ప్రారంభించింది కాంగ్రెస్సేనని ఆయన తెలిపారు.
మోడీ అమ్ముకుంటున్న సంస్థలను స్థాపించింది ఎవరో కేసీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోడీకి పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది మీరు కాదా కేసీఆర్? అని ఆయన నిలదీశారు. తళేశ్వరం ఖర్చుపై నిజ నిర్ధారణ కమిటీ వేయడానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మిషన్ భగీరథతో నీళ్లు ఇస్తున్నామంటున్నారు.. కానీ గజ్వేల్ లో మంచి నీళ్లు అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు. కాలువల ద్వారా నిజంగా నీళ్లిస్తే..ఎనిమిదేళ్లలో 25లక్షల పంపుసెట్లు రైతులు ఎందుకు ఉపయోగిస్తారని ప్రశ్నించారు. ప్రతీ రైతులకు 24 గంటల కరెంటు అవసరం ఎందుకు ఉంటుందని ఆయన నిలదీశారు. మోదీని రక్షించడానికి కాంగ్రెస్ ను కేసీఆర్ దూషిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
65 మంది ప్రధానులు కలిసి 50 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. ఎనిమిదేళ్లలో మోడీ100 లక్షల కోట్లు అప్పు చేశారని ఆయన ఆరోపించారు. అలాంటి మోదీ తో కాంగ్రెస్ ను పోల్చడం కేసీఆర్ దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. చైనా మెడలు వంచింది కాంగ్రెస్ అయితే..2వేల చదరపు కి.మీ.మన దేశాన్ని అక్రమించుకున్న చైనాకు మోడీ క్లీన్ చిట్ ఇచ్చారని పేర్కొన్నారు. అలాంటి మోదీ ప్రభుత్వంతో కాంగ్రెస్ ను పోలుస్తారా అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయ్యాక నిజాం షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లులు మూతవేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కంది పప్పుకు మద్దతు ధర గురించి స్పందించని కేసీఆర్ కంది పంటల గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
సెక్రటేరియట్ దగ్గర నిర్మించే అంబేడ్కర్ విగ్రహం చైనా నుంచి తీసుకొచ్చింది నిజం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ 130సీట్లు గెలుస్తుందని నివేదికలు చెబుతున్నాయని ఆయన తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నేతను లొంగదీసుకోవడానికి 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. కర్ణాటకలో 25నుంచి 30 సీట్లు ఓడించడానికి ఆయనతో బేర సారాలు చేసింది నిజం కాదా? అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్ కు నోప్పేంటిని ఆయన ప్రశ్నించారు. ఇక్కడికి సంబంధించిన ఇంటలిజెన్స్ అధికారులను కర్ణాటక రాష్ట్రంలో నియమించారని ఆయన దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారని రేవంత్ ఆరోపించారు. ఇంత నీచమైన పనికి పూనుకున్న కేసీఆర్ ఈ సమాజానికి చీడ పురుగో కాదో తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. నీ నిజ స్వరూపం తెలిసే కుమారస్వామి నీ సభకు హాజరు కాలేదని.. కేసీఆర్ అరాచకాలకు కాలం తప్పక సమాధానం చెబుతుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని.. దేశంలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగింది. దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ఏం చేసింది..బీజేపీ ఏం చేసింది..కేసీఆర్ ఏం చేశారో తేల్చుకుందామంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల ముందు నిలబడదాం.. ఎవరు దోషులో ప్రజలే తేలుస్తారని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యవహార శైలి అన్ని అనుమానాలకు తావిస్తోందని.. రాజకీయస్వార్థంకోసం, ఆర్ధిక లాభాల కోసం దేశాన్ని కూడా తెగనమ్మే నాయకుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగాలు,ప్రాజెక్టులు.. ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధమని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పై కేసీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగానే డిసెంబర్ లో జరపాల్సిన శీతాకాల సమావేశాలు జరపలేదని రేవంత్ ఆరోపించారు. తబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
