కిరణ్ కుమార్ రెడ్డికి, కేసీఆర్ కు పెద్ద తేడా ఏం లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ను మారిస్తే తప్ప రైతుల జీవితాల్లో మార్పు రాదన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తన హాత్ సే హాత్ జోడో యాత్ర ఆదివారం ఆయన వేములవాడ నియోజకవర్గ పరిధిలో కొనసాగించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కలికోట సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి పేజ్ 2 స్టేజ్ 1ను 2005లో 1750 కోట్లతో వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారని గుర్తుచేశారు. ఇంతమంచి ప్రాజెక్ట్ ను తీసుకొచ్చిన ఆది శ్రీనివాస్ ను ఆనాడు చెన్నమనేని రాజేశ్వరరావు అభినందించారని రేవంత్ తెలిపారు. 2018లో టీఆరెస్ ఓడిపోతుందని హరీష్ రావు కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు శిలాఫలకం వేశారని ఆయన దుయ్యబట్టారు. సాగు, తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారని రేవంత్ చురకలంటించారు.
ఈ నాలుగేళ్లలో ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని.. కాంగ్రెస్ నిరసనలు, పాదయాత్రలు,రాస్తారోకోలు చేసిందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ప్రశ్నిస్తే వరదకాలువ ద్వారా నీళ్లు ఇస్తామని చెబుతున్నారని.. ఎతైన ఈ ప్రాంతానికి వరదకాలువ ద్వారా నీళ్లు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. అపర భగీరథుడు, ఇంజనీర్ కేసీఆర్ కు ఆ మాత్రం తెలియదా అంటూ సెటైర్లు వేశారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు వివక్షకు గురయ్యాయని కేసీఆర్ పదే పదే ప్రశ్నించారని.. ఉమ్మడి పాలనలో సీమాంధ్రులు వివక్ష చూపినట్లే.. తెలంగాణలో కేసీఆర్ కూడా అదే వివక్ష చూపుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also REad: రేవంత్, మహేశ్వర్ రెడ్డికి పోటీగా భట్టి విక్రమార్క.. ఈ నెల 16 నుంచి పాదయాత్ర, తెలంగాణ అంతటా
కిరణ్ కుమార్ రెడ్డికి, కేసీఆర్ కు పెద్ద తేడా ఏం లేదని.. ఈ వివక్షను ఈ ప్రాంత రైతులకు భరించే ఓపిక లేదని ఆయన తేల్చిచెప్పారు. కేసీఆర్ను మారిస్తే తప్ప రైతుల జీవితాల్లో మార్పు రాదని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కలికోట సూరమ్మ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆనాడు తాము మొదలు పెట్టిన ప్రాజెక్టును రేపు మేమే పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ ప్రాంత రైతులకు హామీ ఇస్తున్నానన్నారు.
నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని.. ఈ ప్రాంత సమస్యలపై ఇక్కడి ఎమ్మెల్యేకు అవగాహన లేదని దుయ్యబట్టారు. విహార యాత్రలకు వచ్చినట్లుగా ఎమ్మెల్యే జర్మనీ నుంచి వచ్చి పోతున్నారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కోర్టులను అడ్డుపెట్టుకుని సాంకేతికంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని.. కానీ మానసికంగా ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా గుర్తించడం లేదన్నారు. వారసత్వం ముసుగులో రాజకీయాల్లో కొనసాగుతున్నారని.. రాజేశ్వర్ రావు పేరును చెడగొడుతున్నారని రేవంత్ రెడ్డిఆగ్రహం వ్యక్తం చేశారు.
